హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రోజు నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.
రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. కాగా ఉత్తర–దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వివరించింది.
హైదరాబాద్ నగరంలో గురువారం నాడు గరిష్ఠంగా 35.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.