హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సుస్థిర వ్యవసాయమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుల ఆదాయంతోపాటు, ఉపాధి కల్పన పెరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. శుక్రవారం ఆయన ఆయిల్పామ్, నూనెగింజల సాగు, యాసంగి పంటలపై హైదరాబాద్లోని ఉద్యాన శిక్షణాకేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 30,849 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు మొదలైందని, వచ్చే మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల లక్ష్యం చేరుకోవాలని చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీని వెనువెంటనే రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు కావలసిన మొకలను కూడా ప్రణాళికాబద్ధంగా రైతులకు సరఫరా చేయాలని సూచించారు. కాలానుగుణంగా పంటల సాగు చేపట్టేవిధంగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ సాగు ద్వారా రాష్ట్ర ఆదాయంతోపాటు దాని ఉప ఉత్పత్తులు, వివిధ రకాల అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహించాలని, క్లస్టర్లవారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని నిరంజన్రెడ్డి సూచించారు. పత్తితోపాటు శనగ, వేరుశనగ, మొకజొన్న, నువ్వులు, ఆవాలు, ఇతర అపరాలు, ఆముదం సాగును కూడా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, అదనపు సంచాలకుడు విజయ్కుమార్, అన్ని జిల్లాల ఉద్యాన, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.