హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అంతర్రాష్ట్ర సరఫరాకు అనుకూలంగా ఉండేలా 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తెలంగాణతోపాటు, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో మొత్తం 1300 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నిర్ణయించింది. 15వ విడత పవన విద్యుత్తు ప్రాజెక్టుల్లో భాగంగా ఆహ్వానించిన బిడ్ల దాఖలుకు సెప్టెంబర్ 20 వరకు గడువు విధించింది.
రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో..
తెలంగాణలో సౌర విద్యుత్తుతో పోలిస్తే పవన విద్యుత్తు ఉత్పత్తి నామమాత్రమే. ప్రస్తుతం కేవలం 128 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. పరిగి సమీపంలో 100 మెగావాట్లు, హైదరాబాద్-ముంబై హైవేలో జహీరాబాద్ వద్ద మరో 28 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు, మధ్యప్రదేశ్తోపాటు తెలంగాణలోనూ పవన విద్యుత్తు ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించిన ఎస్ఈసీఐ 1300 మెగావాట్ల ఉత్పత్తికి బిడ్లను ఆహ్వానించింది. తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన 500 మెగావాట్ల ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్తును నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ సబ్స్టేషన్లతో అనుసంధానించనున్నారు.
బీవోవో పద్ధతిలో నిర్వహణ
ఈ ప్రాజెక్టులను బిల్డ్, ఓన్, ఆపరేట్ (బీవోవో) పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర సరఫరా వ్యవస్థ ద్వారా లింక్ చేసి, ఎస్ఈసీఐకి రెన్యూవబుల్ ఎనర్జీని సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి దాఖలైన బిడ్లను సెప్టెంబర్ 25న తెరువనున్నారు. బిడ్ దక్కించుకున్న వారితో ఎస్ఈసీఐ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పవర్పర్చేజ్ అగ్రిమెంట్-పీపీఏ) చేసుకోనుంది. ఈ పీపీఏ 25 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా.. దేశంలో మొత్తం 200 గిగావాట్లకుపైగా పవన విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ కేవలం 168.96 గిగావాట్లు మాత్రమే. ఇందులో 64.38 గిగావాట్ల సౌర విద్యుత్తు, 51.79 గిగావాట్ల జల విద్యుత్తు, 42.02 గిగావాట్ల పవన విద్యుత్తు, 10.77 గిగావాట్ల బయో విద్యుత్తు ఉన్నాయి.