బుద్ధుడు చూపిన మార్గం నేటికీ అనుసరణీయం
జయంతి సందర్భంగా స్మరించుకొన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేసుకొన్న సీఎం.. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింస మార్గాలు నేటికీ అనుసరణీయమని తెలిపారు.
కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల మధ్య నాగార్జున సాగర్లో అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొన్న ‘బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని వెల్లడించారు.. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదని చెప్పారు. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.