రవీంద్రభారతి, ఏప్రిల్ 5: ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. బాబూ జగ్జీవన్రాం 115వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలోని జగ్జీవన్రాం విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జగ్జీవన్రాం గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక వివ్లకారుడని పేర్కొన్నారు. జీవితాంతం అణగారినవర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. జగ్జీవన్రాం, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని వివరించారు. దళితబంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం 268 గురుకులాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని, ఎస్సీ యువతకు 11 స్టడీసర్కిళ్లు, 33 స్టడీ సెంటర్ల ద్వారా ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి చెందాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.