నమస్తే తెలంగాణ నెట్వర్క్,: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామస్మరణతో మార్మోగుతున్నది. శివాలయాల్లో భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, చోరీలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెల్లివిరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగుతున్నాయి. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. శని, ఆదివారాల్లో భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామి గుడి చెరువు వేదిక వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శివార్చన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి శనివారం శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
మహాశివరాత్రి జాతర కోసం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు.