‘సాధారణంగా వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వరద నష్టంపై కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేస్తుంది. కానీ నా విజ్ఞప్తి మేరకు వర్షాలు తగ్గకున్నా కేంద్ర బృందం నష్టం అంచనాపై పరిశీలనకు వస్తున్నది. రెండు రోజుల పరిశీలన తర్వాత కేంద్రానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కేంద్రం జాతీయ విపత్తుల ఉపశమన నిధులు (ఎన్డీఆర్ఎఫ్) ఇస్తుంది. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం తనవద్ద ఉన్న రాష్ట్ర విపత్తుల ఉపశమన (ఎస్డీఆర్ఎఫ్) నిధులు వాడుకోవాలి’
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర క్రితం భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొన్నది. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. కానీ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పినట్టు ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వలేదా అంటే.. గత రెండేండ్లలో 21 రాష్ర్టాలకు ఏకంగా రూ.11,800 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చింది.
మరి.. కిషన్రెడ్డి చెప్పినా.. ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేసి, నివేదిక ఇచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి హైదరాబాద్ వరదలు కనిపించలేదా? ఇక్కడ మీడియా సమావేశంలో బీరాలు పలికిన కిషన్రెడ్డి, ఇప్పటిదాకా చిల్లిగవ్వ ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని అడిగిన దాఖలాలు ఉన్నాయా? కనీసం సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు న్యాయం చేయాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా?
కిషన్రెడ్డీ.. తెలంగాణకు కేంద్ర వరద సాయం ఎక్కడ?
హైదరాబాద్ నగరాన్ని 2020 అక్టోబర్లో భారీ వరదలు అతలాకుతలం చేశాయి. గత వందేండ్లలో రెండో అత్యధిక వర్షపాతం (ఒకేరోజు 32 సెంటీమీటర్లు) నమోదుకావటంతో లక్షలాది మంది వరద నీటిలో అల్లాడిపోయారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ముంపు బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతోపాటు రూ.10 వేల చొప్పున నగదును కూడా ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రమైనా ఇంతపెద్ద విపత్తు వచ్చినప్పుడు కేంద్రాన్ని సాయం కోరడం, కేంద్రం ఆదుకోవడం సర్వసాధారణం. తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు, మొత్తంగా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ 2020, అక్టోబర్ 10న ప్రధానమంత్రికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ లేఖ రాసిన 25 రోజుల తర్వాత పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కూడా వరద సాయంపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదు.
వరద నష్టాన్ని అంచనావేసేందుకు 2020 అక్టోబర్లో కేంద్ర బృందం వచ్చింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘కేంద్ర సాయంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నది. కేంద్ర కమిటీ వచ్చి పరిశీలించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టం, కేంద్ర సాయంపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఇప్పటికే కేంద్రం ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) కింద రూ.224 కోట్ల నిధులు ఇచ్చింది’ అని ప్రకటించారు. వాస్తవానికి ఎస్డీఆర్ఎఫ్ నిధులు సర్వసాధారణంగా కేంద్రం నుంచి రాష్ర్టాలకు వచ్చేవే. ఒకవిధంగా అవి రాష్ర్టాలకు హక్కుభుక్తంగా వచ్చేవి. ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఆ నిధులు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి. ఇవి కాకుండా భారీ వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా రాష్ర్టాలకు చేయూతనిస్తుంది. 2018-19 నుంచి 2021-22 వరకు 21 రాష్ర్టాలకు ఏకంగా రూ.40 వేల కోట్లకు పైగా ఎన్డీఆర్ఎఫ్ నిధులను ఇచ్చింది. గత రెండేండ్లలోనే రూ.11,800.63 కోట్ల సాయం చేసింది. ఇవి కాకుండా ప్రధానమంత్రి జాతీయ విపత్తుల ఉపశమన నిధుల కింద కేంద్రం నుంచి వైపరీత్యాల సమయంలో రాష్ర్టాలకు ఆర్థికంగా చేయూత అందుతుంది. తెలంగాణకు మాత్రం కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. దీనికి తెలంగాణ బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?
మరి ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు వరద సాయం తెస్తారా? మోదీ ఇస్తారా?
హైదరాబాద్ వరదలు దేశమంతా చూసింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాత్రం కనిపించలేదు. 21 రాష్ర్టాలకు వేలకోట్లిచ్చిన తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ వాస్తవాన్ని గుర్తించలేని తెలంగాణ బీజేపీ నేతలు నిత్యం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు.తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడూ ప్రధానమంత్రి, సంబంధిత మంత్రులను కలిసి అడిగిన పాపాన పోలేదు.