దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుడు ఆగస్టులో ‘దళిత బంధు’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. షరతులు లేకుండా, బ్యాంకులతో ఎలాంటి సంబంధం లేకుండానే స్వయం ఉపాధి కోసం దళితులకు రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తున్నది. దీని ద్వారా ఇప్పటివరకు 36 వేలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందాయి.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారానికి నాలుగేండ్లు అవుతున్నది. తొలి విడతలో మాదిరిగా రెండో విడుతలోనూ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రగతి కొత్త శిఖరాలను చేరింది. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కొవిడ్తో దేశమంతటా మందగమనం కనిపించినా.. తెలంగాణలో అభివృద్ధి, సంస్కరణలు ఆగలేదు. పైగా ‘దళిత బంధు’ లాంటి పథకాలతో సంక్షేమ రంగం కొత్త పుంతలు తొక్కింది. ఈ దఫా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి తగ్గట్టే ఆయా రంగాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గత నాలుగేండ్లలో జరిగిన ప్రధాన సంఘటనలను పరిశీలిస్తే..
ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్చేందుకు ‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు విడతల్లో 26 వేల బడుల స్వరూపాన్ని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో 9,123 స్కూళ్లను రూ.3,497.62 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని రకాల వర్సిటీలు కలిపి 16కుపైగా ఉన్నప్పటికీ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేకంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. కోఠి మహిళా కళాశాలను తొలి మహిళా వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది.
నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసింది. రాష్ర్టాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించి 2018 మే 24న జీవోను జారీచేసింది. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ఉద్యోగాల్లో 95% స్థానికులే దక్కించుకునేలా జోనల్ వ్యవస్థను ఖరారు చేసింది. ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేసి, పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది.
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2014లో 1,196 యూనిట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 2022 నవంబర్ నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. రాష్ట్రంలోని 27.02 లక్షల వ్యవసాయ మోటర్లకు రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఉచితంగా 24 గంటలూ విద్యుత్తును అందజేస్తున్నది. కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా.. నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న యాదాద్రి ఆల్ట్రా మెగా ప్రాజెక్టులో 2024 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి 5,112 మెగావాట్లకు పెరిగింది.
బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను 281 నుంచి 310కి పెంచింది. కొత్తగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలు, 33 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది.
సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా పేరుతో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించింది. తద్వారా 48 వేల మందికి లబ్ధి కలుగనున్నది.
నీరాను సాఫ్ట్ డ్రింక్గా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. భువనగిరి దగ్గరలోని నందనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. గీత కార్మికుల సంక్షేమం కోసం మరో నూతన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది.
రజకుల దోబీఘాట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తును అందజేస్తున్నది.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేశారు.
మొత్తం 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వాటిలో 80,039 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని, మరో 11,103 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. దీనికి తోడు మరో 7,029 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు గ్రూప్-1, పోలీస్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వంటి రాత పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూప్-4, ఇంజినీరింగ్, అధ్యాపక పోస్టులు, వైద్యారోగ్య శాఖ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వయోపరిమితి విషయంలో ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పదేండ్ల సడలింపునిచ్చింది.
2019 సెప్టెంబర్ 6న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటివరకు రూ.11,560 కోట్లు ఖర్చు చేశారు. ఇదేవిధంగా 2020 ఫిబ్రవరి 24 నుంచి ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించి రూ.3, 878 కోట్లు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమాలతో పారిశుద్ధ్య సమస్య పరిష్కారమై రోగాలు తగ్గాయి. గ్రామాల్లో, పట్టణాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు సమకూరాయి. పచ్చదనం పెరిగింది. పన్ను వసూళ్ల శాతం కూడా పెరిగింది. జాతీయ స్థాయిలో అనేక విభాగాల్లో తెలంగాణ గ్రామాలు, పట్టణాలకు అవార్డులు, ప్రశంసలు లభించాయి.
‘ఆసరా’ పథకం కింద 57 ఏండ్ల వారికి కూడా పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకంలో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిదారులు చేరారు.
2018 సెప్టెంబర్లో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి నుంచి వాటిని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. 3,146 తండాలు పంచాయతీలుగా మారాయి. ‘మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం’ నినాదం కార్యరూపం దాల్చింది.
నగరాలు, పట్టణాల్లో ఇండ్ల నిర్మాణానికి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అనుమతులు ఇచ్చేందుకు 2020 నవంబర్ 16న టీఎస్బీపాస్ను ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటివరకు 1.54 లక్షల మంది అనుమతులు పొందారు. ఇండ్ల నిర్మాణ అనుమతుల మంజూరులో అవినీతి, జాప్యానికి తెర పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక పచ్చదనం సాధించిన నగరంగా హైదరాబాద్ను వరుసగా రెండోసారి అంతర్జాతీయ స్థాయి ‘గ్రీన్ సిటీ అవార్డు’ వరించింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ‘హరితనిధి’ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలు సృష్టించబడ్డాయి. ప్రతి గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల ఏర్పాటు జరిగింది. అటవీ విస్తీర్ణం వృద్ధి చెందడంతో వన్యప్రాణులు, పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కరోనా విపత్తులో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా 2020లో ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. తద్వారా 9,17,797 ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధిపొందారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పీఆర్సీని వర్తింపజేసింది. దీని వల్ల రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా వెనక్కి తగ్గని రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచింది.
స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతున్నది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 1.36 కోట్ల ఎకరాలకు చేరింది. వరిసాగు ఏకంగా 64.54 లక్షల ఎకరాలుగా నమోదైంది. మరోవైపు ఈ ఏడాదితో ధాన్యం కొనుగోలు విలువ రూ.1.20 లక్షల కోట్లకు చేరనున్నది.
కొవిడ్ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వృద్ధి మాత్రం స్థిరంగా కొనసాగింది. జాతీయ సగటు సహా దాదాపు అన్ని రాష్ర్టాల్లో మైనస్ వృద్ధిరేటు నమోదైనా తెలంగాణ మాత్రం 2 శాతం వృద్ధిని సాధించడం విశేషం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,09,848 గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం 2021-22 నాటికి రూ.2,75,443కు పెరిగింది. జీఎస్డీపీ రూ.8.57 లక్షల కోట్ల నుంచి రూ.11.48 లక్షల కోట్లకు, సొంత పన్నుల రాబడి రూ.65,040 కోట్ల నుంచి రూ.92,910 కోట్లకు పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేండ్లలో ఏకంగా 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. తద్వారా అదనంగా వెయ్యికిపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. వీటికి అనుబంధంగా జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటవుతున్నది.
హైదరాబాద్ నలువైపులా రూ.4 వేల కోట్ల వ్యయంతో 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నిమ్స్ను అదనంగా 2 వేల పడకలతో విస్తరిస్తున్నది. వరంగల్లో రూ.1,200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం జరుగుతున్నది.
పల్లెల్లో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు దాదాపు 3 వేల పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వీటిల్లో డాక్టర్ల నియామకానికి కసరత్తు జరుగుతున్నది. కొత్త పీహెచ్సీల ఏర్పాటుతోపాటు పాత భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. 2023 జనవరి 18 నుంచి రెండో విడత ‘కంటి వెలుగు’ ప్రారంభం కానున్నది. 2018లో ప్రారంభమైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలు పేదలకు ఖర్చును తగ్గిస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు 6 కోట్లకుపైగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’గా మార్పు చెందింది. ఈ నెల 9న సీఎం కేసీఆర్ సంతకంతో జాతీయ పార్టీగా అవతరించింది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ ఏడాది ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
పునరుద్ధరించిన యాదాద్రి ఆలయాన్ని ఈ ఏడాదే ప్రారంభించారు.
మెట్రోరైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 9న కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవ న్, సంత్సేవాలాల్ మహారాజ్ బంజరాభవనాలను సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
గిరిజన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10 శాతానికి పెంచింది.
ఐటీ రంగంలో తెలంగాణ జోరు అప్రతిహతంగా కొనసాగిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.83,442 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు 2021-22లో రూ.1,83,569 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,75,308 నుంచి 7,78,121కి పెరిగింది. 2021-22లోనే కొత్తగా 1,49,506 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఇది నిరుడు దేశవ్యాప్తంగా లభించిన కొత్త ఐటీ ఉద్యోగాల్లో దాదాపు 33 శాతానికి సమానమని నాస్కామ్ వెల్లడించింది.