చౌటుప్పల్: తెలంగాణ గడ్డమీద బీజేపీ కుట్రలు సాగవని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదీశ్రెడ్డితోపాటు మంత్రి హరీశ్రావు, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి యావత్ భారతానికి పాకిందని, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని చెప్పారు.
గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తిరుగుబాటుకు సన్నద్ధమౌతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న భయం బీజేపీకి పట్టుకుందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్లకు వణుకు అని వ్యాఖ్యానించారు. మోదీ సొంత రాష్ట్రంలో దారిద్య్రం పెరిగిందన్నారు. ఆ రాష్ట్రంలో 35 శాతానికి పైగా జనం అర్థాకలితో అలమటిస్తున్నారన్నారు. గుజరాత్ ప్రజలది తాగునీరు కొనుక్కునే దుస్థితి అని మండిపడ్డారు. గుజరాత్లో ప్రజలకు విద్యుత్ సరఫరా కూడా ఆరు గంటలేనని ఎద్దేవా చేశారు.
గుజరాత్లో ఆసరా పింఛన్ అందేది రూ.600 మాత్రమేనని మంత్రి తెలిపారు. అక్కడ మోటార్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి బిల్లుల వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ మాకెందుకు ఇవ్వడం లేదనే చర్చ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మొదలైందని, ఇంటింటికి మంచినీరు మాకెందుకు ఇవ్వడం లేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలు మాకెందుకు లేవని జనం ప్రశ్నిస్తున్నారని, దాంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైందని,
అందుకే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాలొడ్డుతున్నారని, సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందని మంత్రి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలాని ఆయన పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ లాభం చేకూరిందన్నారు. గులాబీ జెండా నీడలోనే అభివృద్ధి, సంక్షేమం సాగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన మొదటి జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని, అందుకే నల్లగొండ జిల్లా ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 కు 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాలు ఎగరడం పెద్ద రికార్డు అన్నారు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతటి గౌరవం దక్కలేదన్నారు. చంద్రబాబు హయాంలోనూ పచ్చ పార్టీకి సింగిల్ డిజిటే వచ్చిందని చెప్పారు.
గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాకే జిల్లా సస్యశ్యామలం అయ్యిందని, 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్తో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్న కండ్లలో బీఆర్ఎస్ వెలుగులు నింపిందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో పార్టీకి తావు లేదని,
ఆత్మీయ సమ్మేళనాలు గులాబీ శ్రేణుల బాంధవ్యాలను పెంపొందిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎండా కాలం వస్తే రాష్ట్రంలో కరెంటు కోతలే ఉండేవని మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ నేతలకే ఉన్నదని చెప్పారు. నాడు సాగర్ జలాలను ఆంధ్రాకు తరలిస్తుంటే కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారా..? అంటూ మంత్రి నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఇక్కడి కాంగ్రెస్ నేతలు పదవుల కోసం వెంపర్లాడారని విమర్శించారు.