Koleti Damodar | ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని, తెలంగాణ అభివృద్ధి వారికి గిట్టడం లేదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు బిజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అడిగితే సమాధానం చెప్పకుండా.. విషం కక్కుతున్నారని విమర్శించారు. విపక్షాలు కళ్లుండి చూడలేని కబోదుల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో అధికారమనేది అందని ద్రాక్షేనన్న ద్వేషంతోనే విపక్షాలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
గోతికాడ నక్క మాదిరిగా అధికారం కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ప్రజలు గతంలో పడిన గోసను గుర్తు చేసుకుని ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చూసి మురిసిపోతుంటే కాంగ్రెస్, బిజేపీలు కళ్లలో నిప్పులుపోసుకుంటున్నాయని కోలేటి విమర్శించారు. అభివృద్ధి, తెలంగాణలో ప్రతిమూలలో పారుతున్న నీళ్లు కనిపించడం లేదా? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజల ఆప్తబంధువైతే కాంగ్రెస్, బీజేపీలు దోపిడీశక్తుల కవల పిల్లలని దామోదర్ విమర్శించారు.
దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్గా నిలిపిన సీఎం కేసీఆర్పై ఎందుకింత కడుపు మంట అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం తమకు పుట్టగతులుండవనే అక్కసుతో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ ఓ విప్లవాన్నే సృష్టించారని దామోదర్ పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్నే గెలిపించుకోవాలనేది జనాభిప్రాయమని, కేసీఆర్ హ్యాటిక్రక్ విజయం కోసం ఊరూవాడ నినదిస్తున్నాయన్నారు. అసత్య ఆరోపణలు చేసే విపక్షాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.