సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అన్నపూర్ణగా మారింది. పంట పెట్టుబడి, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందిస్తుండడంతో రాష్ట్రంలో సిరులపంట పండుతున్నది. వరి కొనబోనని కేంద్రం మొండికేసినా..తానున్నాని కేసీఆర్ అభయం ఇవ్వడంతో అన్నదాతలు భారీగా వరిసాగు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ సర్కారు రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఇప్పటివరకు 62 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా, దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు ఎఫ్సీఐ నివేదికలో వెల్లడైంది.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రైతుల నుంచి 62 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) వెల్లడించింది. వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్సీఐ తాజాగా నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఈ సంఖ్య 70 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉంది. గత ఏడాది వానకాలంలోనూ రికార్డు స్థాయిలో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే, 181 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుతో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. 59 లక్షల టన్నులతో హర్యానా మూడు, 50 లక్షల టన్నులతో ఛత్తీస్గఢ్ నాలుగు , 23 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచాయి.
వరికి కేరాఫ్గా తెలంగాణ
ఒకప్పుడు తిండి గింజలకు సరిపడా వరి సాగుకు నానా తంటాలు పడ్డ తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి అన్నపూర్ణగా మార్చారు. నాలుగేండ్లుగా తెలంగాణ రాష్ట్రం వరికి కేరాఫ్గా మారింది. ప్రతి ఏటా వానకాలం, యాసంగి కలిపి రైతులు కోటి ఎకరాలకు పైగా వరి సాగు చేస్తూ.. 2.5 కోట్ల టన్నులకు పైగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో ప్రతి ఏటా కోటి టన్నులకుపైగా ధాన్యాన్ని తెలంగాణ సర్కారు కొనుగోలు చేస్తున్నది. 2019-20లో 1.11 కోట్ల టన్నులు, 2020-21లో 1.41 కోట్ల టన్నులు, 2021-22లో 1.20 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
వానకాలానికి సంబంధించి ఇప్పటికే 62 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఇది 70 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ యాసంగిలో తెలంగాణలో భారీ విస్తీర్ణంలో వరి సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోనే నంబర్ 1గా నిలుస్తుంది
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలువడం సంతోషంగా ఉంది. త్వరలోనే పంజాబ్ను వెనక్కి నెట్టి దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా నిలుస్తుంది. మన రైతు సత్తా దేశానికి తెలుస్తుంది.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి