హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది. ఈ లెక్కన రోజుకి రూ.786 కూలి లభిస్తున్నది. పత్తికూలీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. మరే రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో గానీ, వీటికి దగ్గర్లో గానీ కూలిరేట్లు లేకపోవటం గమనార్హం. దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ర్టాల్లో పత్తి అధికంగా సాగువుతున్నది.
గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలు టాప్-3 స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిసాగులో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్లో పత్తి కూలీలకు లభించే కూలి కేవలం రూ.35.16 మాత్రమే. అదే విధంగా మహారాష్ట్రలో రూ. 39.14 మాత్రమే ఉంది. రాజస్థాన్లో రూ. 56.14, కర్ణాటకలో రూ.49.35 కూలీ మాత్రమే లభిస్తున్నది. తెలంగాణలో పెద్దఎత్తున వివిధ పంటలు సాగవుతుండటంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. వానకాలం సీజన్లో పత్తితోపాటు అధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నది. కూలీలు తక్కువ… పని ఎక్కువ ఉండటంతో డిమాండ్ పెరిగి అధిక కూలి ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఇతర రాష్ర్టాల్లో పంటల సాగు అంతంతమాత్రంగానే ఉన్నది. అందుకే కూలీలకు డిమాండ్ లేకపోవడంతో తక్కువ కూలి లభిస్తుందనే అభిప్రాయాలున్నాయి.
ఇక పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం సత్తా చాటుతున్నది. పత్తి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నిరుడు (2022-23) 54.41 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు కేంద్రం వెల్లడించింది. 87.12 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తితో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా 81.85 లక్షల టన్నులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నది. తక్కువ విస్తీర్ణంలో పత్తిసాగు చేసి అధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణలో మొత్తం సాగుభూమిలో 15.88 శాతంలో మాత్రమే పత్తి సాగైంది. గుజరాత్లో 20.01 శాతం, మహారాష్ట్రలో 33.20 శాతం పత్తిసాగు చేశారు.