తాండూరు రూరల్, జనవరి 24: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోటబాసుపల్లిలో తన సోదరుడు నర్సింహారెడ్డి నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 33 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో టీచర్ల బదిలీ ప్రక్రియను చేపడుతున్నామని అన్నారు. మిగతా జిల్లాలు అర్బన్ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 9 వేల మందికిపైగా టీచర్లకు పదోన్నతులు కల్పిస్తున్నామని చెప్పారు. 40 శాతం మేరకు టీచర్లకు స్థాన చలనం ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా సీనియార్టీ జాబితా ప్రకటిస్తామని, ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తామని తెలిపారు. మార్చి 4 వరకు పదోన్నతులు, బదిలీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు, ఆయా స్థానాల్లో ఏర్పడే ఖాళీల్లో హెచ్ఎంల భర్తీ ఉంటుందని, ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నాడని మంత్రి సబితారెడ్డి మండిపడ్డారు. టీచర్ల బదిలీల ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. దమ్ముంటే టీచర్ల బదిలీలో అక్రమాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. భార్యాభర్తలు ఒకే దగ్గర ఉద్యోగం చేయాలనే నిబంధనకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దీన్ని కూడా బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి తన కొడుకు తప్పు చేయకుండా మందలించాల్సిందిపోయి రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. అనుమతి తీసుకున్న తరువాతనే పోలీసులు యూనివర్సిటీలోకి వెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. కానీ బండి సంజయ్ మాత్రం సీఎం కేసీఆర్ను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును సరైన మార్గంలో పెట్టాల్సిన బండి సంజయ్ ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు.