Sainik School | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అండగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన సైనిక్ స్కూల్ను హైదరాబాద్కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని డిఫెన్స్ భూముల్లో దీనిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కేంద్ర రక్షణశాఖను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఆరేండ్ల క్రితం దేశవ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్లను కేంద్రం మంజూరుచేసింది. అప్పట్లోనే తెలంగాణకు సైతం ఒక స్కూల్ మంజూరైంది. ఈ స్కూల్ను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది.
హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయి గల వరంగల్ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ధర్మసాగర్ మండలంలో స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని కూడా పరిశీలించింది. ఆ తర్వాత హసన్పర్తిలోని రెవెన్యూశాఖ స్థలాన్ని ఎంపికచేసింది. స్థలం కేటాయింపు ప్రతిపాదనల దశలో ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన మళ్లీ మొదటికొచ్చింది. ఈ స్కూల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీంట్లో భాగంగానే డిఫెన్స్ స్థలాలివ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిసింది. స్థలం కేటాయింపు సాధ్యపడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిఫెన్స్ స్థలాలిచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటుంది. రాష్ట్రంలో జేబీఎస్-తూకుంట రహదారి విస్తరణకు డిఫెన్స్ భూములివ్వమని అడిగితే ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. అలాంటిది సైనిక్ స్కూల్ ఏర్పాటుకు భూములిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.