హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఈ మూడింటికీ మొదటినుంచి ఇప్పటివరకు ఆయన కట్టుబడే ఉన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాలపై తొలి నుంచీ గొంతెత్తుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జలవనరుల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ఆ పత్రిక మాత్రం శుద్ధ అసత్యాలను వండివార్చింది. సాధారణంగా పొరుగు రాష్ట్రం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే.. ప్రభుత్వపరంగా.. కేంద్ర ప్రభుత్వంతోపాటు బోర్డుల దృష్టికి తీసుకెళ్లడం, న్యాయస్థానాలను ఆశ్రయించడం, ఇతర వేదికల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడం అనే మార్గాలు ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వం గత పదేండ్లలో ఈ మూడు ప్రయత్నాలను అత్యంత సమర్థంగా నిర్వహించింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులను కేంద్ర జల్శక్తి శాఖతోపాటు కేఆర్ఎంబీ దృష్టికి పదే పదే తీసుకెళ్లింది. మరోవైపు న్యాయస్థానాలు, ఎన్జీటీని ఆశ్రయించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం, పీఎంవో రివ్యూలు, ఇతర వేదికల ద్వారా ఏపీ అక్రమాలను నిలువరించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
ఆ పత్రిక రాసిన కథనంలో ఏపీలో అక్రమ ప్రాజెక్టులు 2019 నుంచే మొదలైనట్టు, తామేదో ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు, అయినా పట్టించుకోలేదన్నట్టు వండి వార్చింది. కానీ, ఏపీలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం 2017 నుంచే పోరాటం చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ పక్కదారి పట్టించి, వాస్తవాలు తొక్కిపెట్టి, బట్టకాల్చి మీదవేసినట్టు పచ్చి అబద్ధాలు రాసింది.
పొరుగు రాష్ట్రంతో జల జగడాలు భవిష్యత్లో తీవ్ర నష్టం కలిగిస్తాయని నాటి సీఎం కేసీఆర్ భావించారు. అందుకే పొరుగు రాష్ర్టాలతో సఖ్యత కోసం ప్రయత్నించారు. కాళేశ్వరం నిర్మాణంలోనూ స్వయంగా మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపి, ముంపు ప్రాంత సమస్యకు ముగింపు పలికారు. ఇదే తరహాలో ఏపీతోనూ జలజగడానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఇందుకోసం గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించారు. సీఎం జగన్మోహన్రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఈ అంశంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలన్న ప్రతిపాదనపై మొదటి సమావేశంలో ఇద్దరు సీఎంలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ఈ సందర్భంగానే ‘నీళ్ల విషయంలో భేషజాలు లేవు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నదుల అనుసంధానానికి అయ్యే ఖర్చులో చెరో 25%, కేంద్రం నుంచి మిగతా 50% నిధులు సేకరించాలని భావించారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు నీటి తరలింపుపై దాదాపు 5 ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై మరో సమావేశంలో ఇద్దరు సీఎంలు చర్చించారు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేసి నదుల అనుసంధానంతో నాగార్జునసాగర్ నీటిని తెలంగాణ దోచుకుంటుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి వెనక్కి తగ్గారు. వేరే సంస్థతో సర్వే చేయించుకొని, పోలవరం నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్తామంటూ ప్రకటించారు. దీంతో ఇరువురు సీఎంల సమావేశాలు అర్థంతరంగా ముగిశాయి. ఈ వాస్తవాలు ఆ పత్రికతోపాటు ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా వీటిని దాచిపెట్టి బట్టకాల్చి మీద వేసేలా రోత రాతలు రాసింది.
రాష్ర్టాలు విడిపోయినప్పుడు నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదికన నదీ జలాల్లో నీటి వాటాను కేటాయిస్తారు. అంతర్జాతీయ జలసూత్రాలు కూడా దీనినే నిర్దేశిస్తున్నాయి. కానీ విభజన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సూత్రాలను తుంగలో తొక్కింది. అప్పటికే ఆయా రాష్ర్టాల వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని నిర్దేశిస్తూ చట్టంలో సెక్షన్ 89 నిబంధనను పొందుపరిచింది. అప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కే ఆ బాధ్యతను అప్పగించింది. రాష్ట్ర జాబితాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టింది. బోర్డులను ఏర్పాటు చేసి, ప్రాజెక్టులు నిర్వహించాలని నిర్దేశించింది. విభజన మాటున కాంగ్రెస్ చేసిన ఈ దగాపై కేసీఆర్ అవిశ్రాంతంగా పోరాడారు. సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, న్యాయమైన నీళ్ల వాటా రాదని తేల్చిచెప్పారు.
అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై14న కేంద్ర ప్రభ్వునికి వినతిపత్రం అందజేశారు. ఈవిధంగా అధికారంలోకి రాగానే కేంద్రం తలుపుతట్టారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందనే నమ్మకం రాకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత సైతం కేంద్రానికి అనేక లేఖలు రాసింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ పట్టుబట్టడంతో కేంద్రం దిగొచ్చింది. ఆ తర్వాత కూడా అనేక మెలికలు పెట్టింది. అయినా పోరాటం కొనసాగించడంతో గత ఏడాది అక్టోబర్లో సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటివాటా డిమాండ్లను ట్రిబ్యునల్ ఎదుట వినిపించేందుకు అవకాశం లభించింది. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకునేందుకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం కేసీఆర్కే ఉండి ఉంటే సెక్షన్ 3పై ఎందుకు పోరాటం చేస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణకు నదీజలాల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచి రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర, మరోవైపు నదీయాజమాన్య బోర్డుల దగ్గర, ఇంకోవైపు కోర్టుల్లో పోరాటం చేశారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏపీ సీఎంతో రాజీపడ్డారని చెప్పడం అత్యంత దుర్మార్గం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపట్టిన వెంటనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పనులు ఆపేయాలని 2020 జూలైలోనే బోర్డు ఏపీని ఆదేశించింది. ఒకవేళ కేసీఆర్ రాజీ పడితే ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కన్నా ముందే ఆదేశాలు ఎలా వస్తాయి? ఆగస్టు 5న ఏపీపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఫిర్యాదు చేసింది. ఎన్జీటీలోనూ బలమైన వాదనలు వినిపించింది. ఒక ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఏయే వేదికల ద్వారా పోరాడవచ్చో అన్నివైపుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఒత్తిడి చేసింది. కానీ కేంద్రం సహకరించకపోవడం, ఏపీ మొండివైఖరి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో నదుల అనుసంధానంపై చర్చలు జరిగితే, దానికి కూడా అపార్థాలు అంటగట్టి కథనాలు రాయడం అన్యాయం.
– వీ ప్రకాశ్, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్