హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్లోని సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఖైరతాబాద్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మా యదేవి సోమవారం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024కు సంబంధించి స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై సమాలోచలు జరిపారు.
ఈ సందర్భంగా కమిటీ రిపోర్టులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నివేదికను మరింత లోతుగా విశ్లేషించేందుకు కమిషన్లోని సీనియర్ అధికారుల బృందంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ దృష్టిలోకి వచ్చిన అంశాలపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. నివేదికలో గంగపుత్ర, బెస్త, గూండ్ల కులాలను సంక్షిప్త నామంగా అగ్నికుల క్షత్రియ పేరుతో వ్యవహరించడం, మరికొన్ని ఇతర కులాల విషయంలోనూ ప్రధాన కుల పేర్లకు విరుద్ధంగా పేర్కొనడాన్ని కమిషన్ అభ్యంతరం వ్యక్తంచేసింది. వాటిని సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది.