త్వరలోనే ఎనభై వేల ఉద్యోగాల భర్తీ
కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన నా లేఖకు స్పందనే
తాగునీరు సోయి కేంద్రానికి లేదు
అర్హులందరికీ రేషన్కార్డులు, పింఛన్లు
సిరిసిల్ల జిల్లా టూర్లో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, జీఎస్డీపీలో ముందంజలో ఉన్నదని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఎనిమిదేండ్లలో 19 వేల పరిశ్రమలను స్థాపించగా 16 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. త్వరలో 80 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. కేంద్రం పరిధిలో 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తాను వారం క్రితం లేఖ రాసిన నేపథ్యంలోనే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పల్లెప్రగతితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకట్రావుపల్లెలో రూ. 33లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసి, ప్రసంగించారు. అనంతరం చీకోడు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. పరశురాములు నగర్ నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న చీకోడుకు కాలినడకన పాఠశాలకు వస్తున్న 25 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.
పరశురాములునగర్ గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 60 మంది కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి, టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని స్పష్టంచేశారు. నిధులు, నియామకాల కోసమే స్వరాష్ట్రం సాధించుకొన్నామని, ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. 75 ఏండ్లలో దేశంలోని ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలన్న సోయి కేంద్రానికి లేదని విమర్శించారు.
జోడెడ్ల మాదిరి అభివృద్ధి, సంక్షేమం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా పరుగులు పెడుతున్నాయని కేటీఆర్ చెప్పారు. దేశంలోని 20 అత్యుత్తమ గ్రామాల్లో 19 తెలంగాణవి కావడం గర్వించదగ్గ విషయమని, పల్లెప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, సస్యశామలంగా మార్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. ఎండకాలంలోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 నెలల్లో 2,600 రైతు వేదికలు నిర్మించామని, రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.50 వేట కోట్లు జమ చేశామని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. కొత్త రేషన్కార్డులు, పింఛన్ల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమోదం తెలిపినందున త్వరలో అర్హులైన లబ్ధిదారులందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
మనందరి బాగు కోసమే పల్లె, పట్టణ ప్రగతి
మనందరి బాగు కోసమే రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, దీనితో పల్లెల ముఖచిత్రమే మారిపోయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో తాగునీటి సౌకర్యంతో పాటు వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకొన్నామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు తదితరులు పాల్గొన్నారు.