Telangana | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆర్థిక భారాలను మోసే రాష్ట్రంగా తెలంగాణ మారిపోయింది. మణిపూర్ నుంచి ఆదివారం ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రయాణించే ఖరీదైన బుల్లెట్ ఫ్రూఫ్ ఓల్వో బస్సును (TS09GF8055) తెలంగాణ కాంగ్రెస్ కమిటీయే కొనుగోలు చేసి సమకూర్చింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరిట ఈ నెల 4వ తేదీన ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాయలయంలో ఇది టీఎస్ 09 జీఎఫ్ 8055 నంబర్తో రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం దీనిని సుదగోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేసి అల్ ఇండియా కాంగ్రెస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇతను నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ వర్గాల సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్ణాటకలో అధికారంలో ఆ పార్టీ ప్రభుత్వం నిధులు సమకూర్చినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్లాది రుపాయలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యయాన్ని తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం భరిస్తుందనడానికి భారత్ జోడో న్యాయ్ యాత్రకు బహూకరించిన ఖరీదైన ఓల్వో 9400 మాడల్ బస్సే నిదర్శనమని తెలంగాణవాదులు అంటున్నారు.