హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజుల సదస్సులో ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించింది. వీటి ద్వారా సుమారు 13 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనున్నట్టు పేర్కొన్నది. తొలిరోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రెండో రోజు రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు స్పష్టంచేసింది. అత్యధిక పెట్టుబడులు డాటా సెంటర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, విద్యుత్ సెక్టార్లలో వచ్చినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ఎంతో దోహదపడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డాటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజునే ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. అయితే, అట్టర్ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్బస్టర్గా ప్రమోట్ చేసుకొన్నట్టు.. నీరసించిన సమ్మిట్ను రక్తికట్టిందని చెప్పడానికి రేవంత్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం తన అనుకూల పత్రికలతో అబద్ధపు రాతలను రాయించింది. గ్లోబల్ సమ్మిట్లో తొలిరోజునే రాష్ర్టానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయా ఆస్థాన పత్రికలతో ఊదరగొట్టించింది. అంతేనా.. జాతీ య పత్రికల్లో వచ్చిన పెట్టుబడుల లెక్కలను 2, 3 రెట్లు పెంచి గారడీ చేయించింది. పెట్టుబడుల లెక్కలన్నీ తప్పేనని, వచ్చిన ఆ కంపెనీలూ బోగస్వేనంటూ నెటిజన్లు సోషల్మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు.

సోమవారం ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్లో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడుల మేర ఒప్పందాలు జరిగాయని జాతీయ పత్రిక ‘ది హిందూ’ ప్రచురించింది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకే ఈ కథనాన్ని ఇచ్చినట్టు కూడా తెలియజేసింది. ఇక, మరో జాతీయ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’.. రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఓ కథనంలో పేర్కొన్నది. అయితే, పెట్టుబడులను మరింత పెంచాలన్న అత్యుత్సాహం చూపిన రేవంత్ ప్రభుత్వ బాకా పత్రికలు.. ఈ అంకెలను రెండు, మూడింతలు చేసి చూపించాయి. వెలుగు, దిశ పత్రికలతో పాటు ఆంధ్రజ్యోతి కూడా తొలిరోజున రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రచురిస్తే.. ఈనాడు మరో అడుగు ముందుకేసింది. తొలిరోజున ఏకంగా రూ.3,97,500 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాసింది. ఇలా మొత్తంగా స్థానిక పత్రికలు పెట్టుబడులపై ఓ కనికట్టు చూపించాయి.
ఒక్కో పత్రికలో పెట్టుబడుల లెక్కలు ఒక్కోవిధంగా ఉండటం, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన సంస్థలపై అక్రమాల ఆరోపణలు ఉండటంతో రేవంత్ ప్రభుత్వంపై సోషల్మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.లక్ష విలువ చేయని కంపెనీలు రూ.వందల కోట్లల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేయడంపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.