సూర్యాపేట, ఫిబ్రవరి 3 : కృష్ణా నదీ జలాల పర్యవేక్షణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు.
కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులను తీసివేసిందంటే తెలంగాణ హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నట్లేనని మండిపడ్డారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జలశక్తికి అప్పగించడం సరికాదని అన్నారు. దీనివల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం తీవ్ర అన్యాయానికి గురవుతుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు, ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే కృష్ణా నది ఇప్పటికే ఏడారిగా మారుతున్నట్టు చెప్పారు.
కృష్ణా ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తే అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్రావు సమర్థవంతంగా తిప్పికొట్టారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘మన రాష్ట్రం- మన ప్రాజెక్టు-మన హక్కు’ అనే నినాదంతో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని ఎంపీ కోరగా సభ్యులు మద్దతు పలికి తీర్మానం చేశారు.