హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది. దేశంలోనే ఐదు డీఏల బకాయితో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. హిమాచల్ప్రదేశ్ సైతం మన బాటలో నడుస్తున్నది. అత్యధికంగా డీఏలు పెండింగ్ ఉన్న ఈ రెండు రాష్ర్టాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలే కావడం గమనార్హం.
కరువు భత్యం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డీఏలను విడుదల చేయాలి. రాష్ట్రంలో 3.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ చొప్పున ఠంచన్గా రావాల్సి ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ డీఏలను బిచ్చమేసినట్టు ఇస్తున్నది. ప్రతిసారి కేవలం ఒక డీఏను మాత్రమే విడుదల చేస్తున్నది. ఈ డీఏ విడుదల చేసే సమయానికి మరో డీఏ వచ్చి చేరుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున డీఏలను విడుదల చేస్తున్నది. డీఏల విడుదల జాప్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారంలోకి వస్తే తక్షణమే డీఏలు చెల్లిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పెండింగ్ డీఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ, అమలు మాత్రం చేయట్లేదు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం, మణిపూర్, త్రిపుర రాష్ర్టాల్లో మాత్రమే డీఏలు పెండింగ్ లేవు. పెద్ద రాష్ర్టాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ర్టాల్లో కేవలం ఒక డీఏ మాత్రమే పెండింగ్ ఉన్నది. నాగాలాండ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ వంటి చిన్న రాష్ర్టాల్లోనూ ఒక డీఏ పెండింగ్ ఉన్నది. ఇక ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ర్టాలు దీపావళి బోనస్, గుజరాత్, యూపీ రాష్ర్టాలు ఉద్యోగులకు బోనస్ అందజేస్తున్నాయి.
మ్యానిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఎరియర్స్తో సహా పెండింగ్ డీఏలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామని పూర్తిగా విస్మరించారు. రెండున్నరేండ్లు పీఆర్సీ నష్టపోయాం. హెల్త్కార్డులు ఇస్తామన్నా రు. మొత్తం అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా రు. ఒక డీఏ ఇచ్చి మళ్లీ ఐదు డీఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ ప్రకటించినా, సర్కార్లో చలనం లేదు. మే 5న నిరాహార దీక్షలతో ప్రభుత్వం కండ్లు తెరిపిస్తాం.
– కే లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్