Summer | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఈసారి శివరాత్రి రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. చలిప్రభావం తగ్గి మార్చి తొలివారంలోనే అధిక ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి. ఆదివారం ఏకంగా సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఆ శాఖ తెలిపింది. గద్వాల, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. మరో ఐదు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఒకటి రెండు వారాల్లో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటుందని ఆందోళన నెలకొన్నది.
ఈసారి వేసవిలో పగలు సగటు ఉష్ణోగ్రతల కన్నా దాదాపు 5 డిగ్రీల మేర అధికంగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్నేండ్లుగా సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్టు చెప్తున్నారు. నిరుడు ఎండాకాలంలో (మార్చి నుంచి మే వరకు) అత్యధికంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో నమోదైంది. మే 18న 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి అం తకు మించి నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నిరుడు మార్చిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఈసారి 3న 37 డిగ్రీలు దాటడం గమనార్హం. నిరుడు మార్చి 31న అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం లో 42.6 డిగ్రీలు నమోదైంది. ఈసారి మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. జీహెచ్ఎంసీలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. 2021 మార్చి 3న 33 డిగ్రీలు ఉండగా, ఈ ఆదివారం 34 డిగ్రీలుగా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.