వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 27: అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయని యూనివర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ రవీందర్రెడ్డి, రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏకాంబరం తెలిపారు. బుధవారం వారు యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ పాలు ఇచ్చే మేలు రకం దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశువైద్య కళాశాల కేంద్రంగా నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయని తెలిపారు.
అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆవుల అండాశయం నుంచి అండాలను సేకరించి, వాటిని అధిక పాల ఉత్పత్తి సార కలిగిన ఆంబోతుల (కోడెల) వీర్యంతో ప్రయోగశాలలో ఫలదీకరణ జరిపినట్టు చెప్పారు. ఇలా రూపుదిద్దుకొన్న పిండాన్ని ఇంక్యుబేటర్లో పెంచి, ఎదకు వచ్చిన ఆవుల గర్భాశయంలోకి చేర్చి తద్వారా మేలు జాతి దూడలను పుట్టించినట్టు వివరించారు. ఇలా పుట్టిన దూడలు దేశవాళీ ఆవు జాతి (సాహివాల్) లక్షణాలను కలిగి, ఒక ఈత కాలంలో దాదాపు 3 వేల లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యంతో ఉంటాయని తెలిపారు. శాస్త్రవేత్తల అవిరళ కృషికి తోడుగా ప్రభుత్వం పశు సంపదకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. పశు వైద్య కళాశాల పునరుత్పత్తి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు చేసినట్టు తెలిపారు.