హైదరాబాద్, జనవరి 29 : విద్యాసంస్థలను మంగళవారం నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలన్నింటినీ ప్రారంభించుకోవచ్చని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మెమో-5536ను జారీచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 16 వరకు మెడికల్ కాలేజీలు మినహా విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత ఈ నెల 30 వరకు పొడిగించింది. సెలవుల్లో విద్యార్థులు నష్టపోకుండా 8, ఆపై తరగతుల్లోని విద్యార్థులకు డిజిటల్, ఆన్లైన్ క్లాసులను నిర్వహించారు. నాలుగు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వైరస్ బారినపడ్డవారు త్వరగా కోలుకొంటున్న నేపథ్యంలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. కరోనా ప్రభావం తక్కువగా ఉండటంతో చాలా రాష్ట్రాలు, దేశాలు విద్యాసంస్థలను తెరిచాయి. ఆంధ్రప్రదేశ్లో ఎల్కేజీ నుంచి స్కూళ్లు నడుస్తుండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ స్కూళ్లను ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తదితర దేల్లో విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిని పరిగణనలోనికి తీసుకొని తెలంగాణలోనూ విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు.
మూడు వేవ్ల్లోనూ ఫిబ్రవరి 1న పునః ప్రారంభం
రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఫిబ్రవరి 1కి ప్రత్యేకత ఏర్పడింది. 2021, 22 సంవత్సరాల్లో ప్రత్యక్ష తరగతులు ఫిబ్రవరి 1నే ప్రారంభమయ్యాయి. కరోనా మొదటి వేవ్ నేపథ్యంలో 2020 మార్చి 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు విద్యాసంస్థలు మూతబడ్డాయి. సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించి, 2021 ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. కరోనా రెండో దశ నేపథ్యంలో తిరిగి 2021 మార్చి 25న విద్యాసంస్థలన్నింటినీ మూసివేశారు. పరీక్షలను రద్దుచేసి పై తరగతులకు ప్రమోట్చేశారు. 2021 -22 విద్యా సంవత్సరంలో జూలై 1న ఆన్లైన్ క్లాసులు, సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించారు. కరోనా థర్డ్వేవ్ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ఇచ్చిన సెలవులకు ఫిబ్రవరి 1న ముగింపు పలుకుతుండటం యాధృశ్చికమే.
స్వాగతించిన సంఘాలు
విద్యాసంస్థలను పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసొసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్రావు, సాదుల మధుసూదన్, కోశాధికారి ఐవీ రమణారావు, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీసతీశ్, ట్రస్మా (పాపిరెడ్డి వర్గం) నేతలు కందాల పాపిరెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, చింతల రామచందర్, అరుకాల రామచంద్రారెడ్డి, టెక్నికల్ స్టాఫ్ అసొసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.