Mahmood Ali | తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మద్దూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఖజా ఆరిఫ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడా లేవన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతోపాటు సాగు, తాగునీరు ఇస్తూ పెట్టుబడి సాయంగా రైతుబంధు రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మూడోసారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిద్దిపేట కమిషనర్ శ్వేత, ఏసీపీ సతీశ్, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.