హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం పాలన నేటితో ముగయనున్నది. రాష్ట్రంలోని సర్పంచులు (Sarpanchs) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. వారి పదవీ కాలం ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను(Special officers) నియ మించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు కోరారు.
అలాగే ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే తమకు మరో ఆరు నెలలు అవకాశం ఇచ్చి, పర్సన్ ఇన్చార్జిలను నియమించాలని సర్పంచులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవనుండగా మరో ఆరు నెలల తర్వాతనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలన చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టాల్సిన ఆరు గ్యారెంటీలపై మొదట దృష్టి పెట్టింది. ఆ గ్యారెంటీలు అమలు చేసే లోపే పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక కొత్త ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాత రిజర్వేషన్లే అయితే జూన్ లేదా జూలైలో ఈ పల్లె పోరు జరుగనున్నది. ఒక వేళ రిజర్వేషన్లు మార్చాలి అంటే మరోసారి చట్టం చేయాల్సి ఉండే అవకాశం ఉన్నందున మరికొంత ఆలస్యం కానుంది. ఇదిలా ఉండగా ఇదే సంవత్సరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.