హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు బుధవారం హైదరాబాద్లో గౌరీశంకర్తో భేటీ అయ్యారు. ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే జాతీయ సెమినార్లో భాగస్వామ్యం కావాలని జనరల్ కౌన్సిల్ను జూలూరు కోరారు.
భవిష్యత్తులో నిర్వహించనున్న సాహిత్య కార్యక్రమాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత తరానికి తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు సానుకూలంగా స్పందించారు. తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొఫెసర్ సీ మృణాళిని, జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ప్రసేన్, మందలపర్తి కిషోర్ను జూలూరు గౌరీశంకర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.