హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్లో తెలంగాణ రోడ్లు, భవనాలు శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్ స్టాల్లో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బీ అధ్వర్యంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న పలు నమూనాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి కలియతిరిగి పరిశీలించారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణ నమూనా, అమరవీరుల స్మారక చిహ్నం, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా చక్కగా,ప్రజలకు అర్థమయ్యే రీతిలో అన్ని నిర్మాణాలు అద్భుతంగా రూపొందించారని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి వేముల ప్రశంసించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ఆర్ అండ్ బీ అధ్వర్యంలో చారిత్రాత్మక ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా, గొప్పదనాన్ని చాటేలా నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు. 2014 కు ముందు ఆర్ అండ్ బీ శాఖ అధ్వర్యంలో ఉన్నవి 30 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం గల బిల్డింగ్ నిర్మాణాలే అని, ఈ ఎనిమిదేండ్లలో ఒక కోటి స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.
మరో ఒక కోటి స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వీటి కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు రోడ్లు భవనాలు శాఖ అధ్వర్యంలో నిర్మాణాలు జరగలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో, ఆలోచనలతో ప్రపంచ ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణాలు చేపట్టుకున్నామని తెలిపారు.
హుస్సేన్ సాగర్ తీరాన నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచలోనే గొప్ప కట్టడంగా నిలువనుందని అన్నారు. చికాగో, దుబాయ్ తర్వాత హైదరాబాద్ లోనే అట్లాంటి నిర్మాణం ఉందని తెలిపారు. అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ ఉపయోగించి కడుతున్న ఈ నిర్మాణం ప్రపంచలోనే పెద్ద కట్టడంగా నిలువనుందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్లు గొప్పగా ఉన్నాయన్నారు. ఇవన్నీ కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన నిర్మాణాలే అని,హైదరాబాద్ ప్రజలు ఆర్ అండ్ బీ స్టాల్ను సందర్శించి తెలంగాణ ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణాలు చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సీఈ సతీష్, మధుసూధన్, ఈఈ శ్రీనివాస్, డీఈ మాధవి పలువురు ఆర్ అండ్ బీ అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.