బీజేపీ ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలపై తెలంగాణవాదుల ఆగ్రహం
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా టంచనుగా రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్వాలని 13, 14, 15వ ఆర్థిక సంఘాలు సూచించిన రూ.3051.24 కోట్ల నిధులను ఇప్పటివరకు రాష్ర్టానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు చట్టబద్ధంగా రావాల్సిన ఇతర నిధులను కలిపితే తెలంగాణకు రూ.7 వేల కోట్లు రావాల్సి ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వెంటనే కేంద్రం నుంచి విడుదల చేయించాలని ఈటలను డిమాండ్ చేస్తున్నారు.
ఆర్థిక సంఘాల ఇదీ లెక్క..
n 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,129.93 కోట్లు రావాల్సి ఉన్నది. ఇందులో స్థానిక సంస్థలకు సంబంధించిన రూ.778.72 కోట్లు, పర్యావరణ అభివృద్ధికి సంబంధించిన రూ.351.21 కోట్లు ఉన్నాయి.
n 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తంలో రాష్ర్టానికి ఇంకా రూ.817.61 కోట్లు రాలేదు. ఇందులో రూ.315.32 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు, రూ.502.29 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సి ఉన్నది.
n 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తంలో కేంద్రం నుంచి రూ.1,103.70 కోట్లు రావాలి. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.682.50 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.331.40 కోట్లు, ఎస్డీఆర్ఎఫ్కు రూ.89.80 కోట్లు రావాలి.