Telangana Income | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ఉన్నది. రాబడులను పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,54,518.17 కోట్ల రాబడి వచ్చింది.
ఇది బడ్జెట్ అంచనా (రూ.2,45,256.61 కోట్లు)లో 63 శాతానికి సమానం. ఇందులో సొంత పన్నుల రూపేణా రూ.1,05,167.52 కోట్లు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రూ.34,729 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.24,745 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.14,598 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా రూ.11,806 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.9,205 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.7,876 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల రూపంలో రూ.7,112 కోట్లు, పన్నేతర రాబడి కింద రూ.10,405 కోట్లు వచ్చాయి.
2021-22లో పన్నుల ద్వారా మొత్తం రూ.2,21,686 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా తొలి 10 నెలల్లో రూ.1,42,688.79 కోట్లు వచ్చాయి. దీనితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి గణనీయంగా పెరిగిందని, అందులో రెవెన్యూ వ్యయం 1,24,681.68 కోట్లుగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదించింది.
జనవరి వరకు తెలంగాణ రాబడులు
2021-22లో రూ. 1,42,688.79 కోట్లు
2022-23లో రూ.1,54,518.17 కోట్లు