హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,157 మందికి పాజిటివ్గా తేలినట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. పాజిటివిటీ రేటు 2.98 శాతంగా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 361, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలో 245, రంగారెడ్డిలో 206, నిజామాబాద్లో 187, సంగారెడ్డిలో 135, జగిత్యాలలో 107, కరీంనగర్లో 74, మహబూబ్నగర్, నల్లగొండలో 68 చొ ప్పున, వరంగల్ అర్బన్లో 64, ఆదిలాబాద్లో 65, ఖమ్మం, సిద్దిపేటలో 59 చొ ప్పున, కామారెడ్డిలో 57, మంచిర్యాల 51 కేసులు వెలుగుచూశాయి. కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్సపొందుతూ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 25,459 మంది దవాఖానలు, ఇండ్లలో చికిత్సపొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.86 శాతంగా, జాతీయ సగటు 88.9 శాతంగా నమోదైంది. ఏపీలో బుధవారం 4,157 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 18 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ కాంటినెంటల్ దవాఖానకు తరలించారు. తెలంగాణలో కరోనా టీకా వేసుకున్నవారి సంఖ్య 23 లక్షలు దాటింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 33,583 మందికి టీకా వేసినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. 31,077 మంది తొలిడోస్, 2,506 మంది రెండోడోస్ తీసుకున్నారని తెలిపింది. తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 20,10,611 కాగా, 3,12,340 మంది రెండుడోసులు వేసుకున్నారు.