హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది. ఈ సంవత్సరం రైతు బీమా పథకంలో గత ఏడాది కంటే 2.12 లక్షల మంది రైతులు అదనంగా చేరారు. గత సంవత్సరం ఈ పథకంలో 35.64 లక్షల మంది అర్హులు ఉండగా, ఈ ఏడాది 37.77 లక్షలకు చేరారు. 2018 ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారం కింద రూ.5 లక్షల చొప్పున అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రీమియం సొమ్మును తగ్గించేలా ఎల్ఐసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. గత ఏడాది ఒకో రైతుకు రూ.4,110 చొప్పున ప్రీమియం చెల్లించగా, ఈ ఏడాది రూ.3,830 మాత్రమే చెల్లించారు. గత ఏడాది 35.64 లక్షల మంది రైతుల కోసం రూ.1,465 కోట్లు చెల్లించగా, ఈ ఏడాది 37.77 లక్షల మంది రైతులకు రూ.1,450 కోట్లు చెల్లించింది. లబ్ధిదారుల సంఖ్య పెరిగినా ప్రీమియం సొమ్ము తగ్గిందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా సమయంలో ఎల్ఐసీ ప్రీమియం సొమ్మును ఎకువ వసూలు చేసింది. ఆ సమయంలో సాధారణ మరణాలతోపాటు కరోనాతోనూ కొందరు రైతులు చనిపోయారు. దీంతో ఎల్ఐసీ క్లెయిమ్స్ ఎకువగా చెల్లించిందని అధికారులు తెలిపారు. గత నాలుగేండ్లలో 84,945 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా పరిహారం రూ.4,247 కోట్లు పంపిణీ చేశారు. 2020- 21లో 28,989 మంది రైతులు చనిపోయారు. మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఆ ఒక ఏడాదే అధికంగా మరణించారు. ఆ సంవత్సరంలో అత్యధికంగా రూ.1,449 కోట్లు చెల్లించారు. ప్రీమియం కంటే క్లెయిమ్స్ చెల్లింపులు అధికంగా ఉండటం గమనార్హం.