Redco-Y Satish Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఆయన విజయంపై విచారణకు ఆదేశించాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. `మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తా.. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే` అని బీజేపీ ఎంపీ అర్వింద్ స్వయంగా బహిరంగంగా చెప్పారు.
అరవింద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్పై అనుమానాలు కలుగుతున్నాయని వై సతీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఎన్నికలు, బీజేపీ గెలుపుపైనా అనేక సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లయితే వెంటనే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి, ధర్మపురి అరవింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఎలా గెలిచాడనే దానిపై విచారణకు ఆదేశించాలన్నారు.
ఇప్పటికే ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలు కూడా అడ్డదారిలోనే గెలిచారా అనే అనుమానాలు ఉన్నాయని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా అది తప్పుడు విధానాల్లో గెలిచినట్లేనని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే దేశంలోని స్వతంత్ర సంస్థలన్నింటిని ప్రధాని మోదీ పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టు కున్నారని సతీశ్ రెడ్డి ఆరోపించారు. పూర్తిగా స్వేచ్ఛగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా మోదీ పంజరంలోని చిలక మారిపోయిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అరవింద్ మాటలతో అది పూర్తిగా నిజమేననిపిస్తున్నదన్నారు. కనుక దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని కోరారు. లేకపోతే ఎలక్షన్ కమిషన్ విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమేనని యావత్ దేశం భావించాల్సి ఉంటుందన్నారు.