హైదరాబాద్: బీజేపీ అంటేనే హామీలిచ్చి మరిచిపోవడం, ప్రజలను మోసం చేయడం అన్న సంగతి మరోసారి రుజువైందని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలకు బీజేపీ నేతలు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016లో అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మునుగోడులో ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని సతీష్ రెడ్డి గుర్తుచేశారు.
2016లో మర్రిగూడకు వచ్చిన నడ్డా అక్కడ 300 పడకల హాస్పిటల్ను, చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, సామాజిక భద్రత కింద ఫ్లోరైడ్ బాధితులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని బీజేపీ పూర్తిగా మరిచిపోయిందని సతీష్ రెడ్డి విమర్శించారు. ఫ్లోరైడ్ బాధను తీర్చేందుకు రాష్ట్ర సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు అండగా కూడా కేంద్రం నిలవలేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధమైన నీరు ఇచ్చి ఫ్లోరైడ్ లేకుండా చేశారన్నారు.
ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ కోసం దండుమల్కాపురంలో తెలంగాణ సర్కారు స్థలం కేటాయించినా కేంద్రం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నదని సతీష్రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు మునుగోడుకు బై ఎలక్షన్ రావడంతో అదే పార్టీ నుంచి బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలంతా మళ్లీ ఇలాంటి హామీలే ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడు ప్రజలు మాత్రం తమకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగించి, సాగు, తాగు నీటి కష్టాలు తీర్చిన టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.