హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): 8 ఏండ్లలో తెలంగాణ తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగింది. ఒకవైపు కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నా.. మరోవైపు సొంతకాళ్లపై నిలబడు తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. ఏటా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నది. పటిష్ట ఆర్థిక ప్రణాళికతో సొంత పన్నుల రాబడుల్లో గణమైన వృద్ధిరేటు ను సాధిస్తున్నది. 2014-15లో సొంత పన్ను ల రాబడి రూ.29,288 కోట్లుగా ఉంటే, 2021-22కు అది ఏకంగా రూ.92,910 కోట్ల కు చేరింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సొంత పన్ను ల రాబడి మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో అక్టోబర్ నాటికే బడ్జెట్ అంచనాల్లో 55 శాతం సొంత పన్నుల రాబడిని సా ధించింది. ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సొంత పన్నుల రాబడి బడ్జెట్ అంచనాలను మించే సూచనలు కనిపిస్తున్నాయి.
నిరుటితో పోలిస్తే 29 శాతం వృద్ధి
బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నురాబడి రూ.1,06,900.13 కోట్లు వస్తాయని రాష్ట్రప్రభుత్వం అంచనా వేయగా, రూ.92,910 కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సం వత్సరం అక్టోబర్ నాటికి రూ.54,198.78 కోట్లు రాబడుల రూపంలో వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నురాబడిని మరింత పెంచుతూ రూ.1,26,606.04 కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాలను రూపొందించింది. అందుకు అనుగుణంగా అక్టోబర్ నాటికే రూ.70,126.66 కోట్ల రాబడి వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈసారి అక్టోబర్ నాటికి రాష్ట్ర సొంత పన్నురాబడి 29 శాతం పెరిగింది.
జీఎస్టీ రాబడిదే అగ్రస్థానం
2022-23 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి వృద్ధిలో జీఎస్టీదే అగ్రస్థానం. తెలంగాణలో జీఎస్టీ రాబడిలో నిరుడుతో పోలి స్తే ఈసారి 32 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నా టికి రూ.17,799 కోట్లు జీఎస్టీ వసూళ్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్ నాటికి రూ.23,493 కోట్ల రాబడి వచ్చింది. ఈ సారి రూ.42,139 కోట్లు వస్తాయని అంచనా వేయగా ఏడు నెలల్లోనే 56 శాతం రాబడిని సా ధించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా అక్టోబర్ నాటికి రూ.8,238 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.17,329 కోట్లు, కేంద్ర పన్నుల వా టా రూపంలో రూ.5,911 కోట్లు, ఎక్సైజ్ డ్యూ టీల ద్వారా రూ.10,320 కోట్లు ఖజానాకు సమకూరింది. ఇతర పన్నులు, సుంకాల రూపంలో మరో రూ.4,832 కోట్ల రాబడి వచ్చింది. కేంద్రం కుట్రలు పన్నినా, తెలంగాణ అన్నింటా రాబడులను పెంచుకుంటున్నది.
కేంద్రం కుట్రతో రూ.40 వేల కోట్ల నష్టం
తెలంగాణలో ఆదాయం పరుగులు పెడుతున్నా.. కేంద్రం కొర్రీలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. రాబడి పుష్కలంగా ఉన్నప్పటికీ, కేంద్రం మోకాలడ్డడంతో రాష్ర్టానికి రూ.40 వేలకోట్ల నష్టం వాటిల్లింది. ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ర్టానికి ఆనవాయితీగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను కేంద్రం ముందస్తుగా వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్రం బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంది. కానీ.. అకస్మాత్తుగా దానిని రూ.39 వేలకోట్లకు కేంద్రం కుదించింది. దీంతో రాష్ర్టానికి రూ.15 వేలకోట్లు తగ్గాయి. అంతేకాకుండా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ర్టాలకు అదనంగా 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకునే సౌలభ్యాన్ని కూడా తెలంగాణ వాడుకోనీయకుండా కేంద్రం అడ్డుపుల్ల వేసింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామని కొర్రీ పెట్టింది. తెలంగాణ రైతులకు నష్టం చేసే విద్యుత్తు సంస్కరణలను ఒప్పుకునేది లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనడంతో సుమారు రూ. 6వేలకోట్లు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తం గా కేంద్రప్రభుత్వ సంకుచిత విధానాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.21వేల కోట్ల నిధు లు ఆగిపోయాయి. అప్పటికీ మోదీ సర్కారు కళ్లు చల్లబడలేదు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా నిలిపివేయించింది. కేంద్రం అనాలోచిత వి ధానాలు, ఆర్థిక అజ్ఞానం, అక్కసుతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి దాదాపు రూ.40 వేల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది.