హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, వాటికి న్యాయమైన నీటి కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని.. వాటిని వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం కేంద్ర జల్శక్తి మంత్రిని కలిసి తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను, వాటికి ఉన్న నీటి కేటాయింపులను కూలంకషంగా వివరించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ర్టానికి ఉన్న న్యాయమైన వాటాకు సంబంధించి అన్ని నివేదికలను ఈ సందర్భంగా అందజేశారు.
గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు
రాష్ర్టానికి గోదావరి జలాల్లో 967.94 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులో ఇప్పటికే 758.76 టీఎంసీలను వినియోగించుకొనేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 148.82 టీఎంసీలకు హైడ్రాలజీ విభాగం క్లియరెన్సులు ఇచ్చిందని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల కోసం 60.26 టీఎంసీల జలాలను రిజర్వులో పెట్టుకున్నామని వెల్లడించారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85 టీఎంసీలను కేటాయింపులు ఉన్నాయని, అందుకు సంబంధించి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కూడా ఉన్నదని గుర్తుచేశారు. ఇందిరాసాగర్, రాజీవ్సాగర్కు 16 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ ప్రిన్సిపుల్ అప్రూవల్స్కూడా ఇచ్చారని వివరించారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 38 టీఎంసీలను కేటాయించడంతోపాటు, ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే అనుతులన్నీ పొందామని తెలిపారు. మొత్తంగా ఈ నాలుగు ప్రాజెక్టులకు 155 టీఎంసీలను కేటాయిస్తూ సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులకు సంబంధించిన పత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం 70 టీఎంసీలతో సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం బరాజ్సహా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 60 టీఎంసీలతో, ముక్తీశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును (చిన్న కాళేశ్వరం) 4.5 టీఎంసీలు, రామప్ప-పాకాల లింక్ను 3 టీఎంసీలు, మోడికుంటవాగు ప్రాజెక్టును 2.14 టీఎంసీలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలను 0.8 టీఎంసీలతో చేపట్టామని వెల్లడించారు. సీడబ్ల్యూసీ కేటాయించిన మొత్తం 155 టీఎంసీలలో 140.44 టీఎంసీలు వినియోగించుకుని, మిగిలిన 14.56 టీఎంసీలను రిజర్వ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
వాటికి అనుమమతులే అక్కర్లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, అందుకు సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొందామని సీఎం కేసీఆర్.. కేంద్రమంత్రి షెకావత్కు వివరించారు. కేటాయించిన నీటిని తక్కువ సమయంలో వినియోగించుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర నిధులతో ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ అదనపు టీఎంసీ తరలింపునకు కొత్తగా ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొనడమేగాక.. గెజిట్లో అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరాన్ని చేర్చారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, అదనపు టీఎంసీ తరలింపునకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదని కేంద్రమంత్రికి సీఎం స్పష్టం చేశారు. కందకుర్తి లిఫ్ట్ చిన్నతరహా ప్రాజెక్టు అని, కేవలం 3,300 ఎకరాల ఆయకట్టుకే నీటిని అందిస్తున్నదని, దానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రామప్ప-పాకాల లింక్, తుపాకులగూడెం బరాజ్.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక భాగమని, వాటికి కొత్తగా అనుమతులు అక్కర్లేదని వివరించారు. కడెం ప్రాజెక్టులో గూడెం లిఫ్ట్ ఒక భాగమని, అదికూడా చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకేనని స్పష్టంచేశారు. కంతనపల్లి ప్రాజెక్టు సైతం కొత్తదేమీ కాదని, దానిని కూడా అనుమతుల్లేని జాబితా నుంచి తొలగించాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ), సీడబ్ల్యూసీకి మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో సీఎం కేసీఆర్తోపాటు సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఎస్ఈ కోటేశ్వర్రావు, కేంద్రమంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.