పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ సీఎం హోదాలో మోదీ ఆరోపిస్తే.. ప్రస్తుత కరెంటు సంక్షోభానికి కారణం రాష్ర్టాలేనని ఇప్పుడు ఆయన సహచర కేంద్ర మంత్రి నిందిస్తున్నారు. విద్యుత్తు వైఫల్యం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రధానిగా ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారన్నదే ప్రధాన ప్రశ్న. ఆయన పాలన వెలగబెట్టిన ఈ ఎనిమిదేండ్లలోనే తెలంగాణ.. చీకట్లను చీల్చుకుని వెలుగుల ప్రస్థానాన్ని ప్రారంభించింది. నిరంతరాయ విద్యుత్తుతో రాష్ర్టాన్ని వెలిగిస్తున్నది. విద్యుత్తు సంక్షోభపు నడిసంద్రంలో చిక్కుకున్న దేశానికి దీపస్తంభంలా దిశానిర్దేశం చేస్తున్నది. ఇది దార్శనికుడు కేసీఆర్ ముందుచూపు.
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): యావత్ దేశంలో వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వమో, టీఆర్ఎస్ నేతలో చెబుతున్నది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట. ‘ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ పేరిట మే 17న విడుదల చేసిన తన నివేదికలో ఆర్బీఐ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ‘వ్యవసాయానికి జల వనరులను సమర్థంగా నిర్వహిస్తున్న తెలంగాణ.. భూగర్భ జలాలను పెంచేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. పలు రాష్ర్టాలు వ్యవసాయానికి విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాయి. దేశంలోని 19 వ్యవసాయ ప్రధాన రాష్ర్టాల్లో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది తెలంగాణ మాత్రమే..’ అని కితాబిచ్చింది. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో భూగర్భ జలాల వాడకం అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయాన్ని స్థిరంగా కొనసాగించడం కష్టసాధ్యమని కూడా ఆ నివేదికలో పేర్కొన్నది. అయితే తెలంగాణలో మాత్రం ఇది సాధ్యమైందని పేర్కొన్నది. డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ ఊదరగొడుతున్న బీజేపీ.. దాని పాలిత రాష్ర్టాల్లోనూ తెలంగాణ స్థాయిలో సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందించడం లేదని ఆర్బీఐ తన నివేదికలో చెప్పిన విషయాలను బట్టి అర్థమవుతున్నది. కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ర్టాల్లో రాయితీ విద్యుత్తును అందిస్తున్నా.. అది తెలంగాణ స్థాయిలో లేదు.
37-38 శాతం వ్యవసాయానికే..
రాష్ట్రంలో వినియోగిస్తున్న విద్యుత్తులో సుమారు 37-38 శాతం వరకు వ్యవసాయానికే సరఫరా అవుతున్నదని విద్యుత్తు శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత మార్చిలో తెలంగాణలో 14,160 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైంది. ఆ లెక్కన దాదాపు 38 శాతం (5,300 మెగావాట్ల) విద్యుత్తు డిమాండ్ వ్యవసాయ రంగానిదేనని చెప్పవచ్చు. సాగుకు ఉచిత నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.10 వేల కోట్లకుపైగా సబ్సిడీ మొత్తాన్ని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నది. ప్రతి సంవత్సరం ఈ స్థాయిలో బడ్జెట్లో ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నది.
భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి..
ఆర్బీఐ తన నివేదికలో వ్యవసాయం, నీటివసతి గురించి చెబుతూనే.. పలు రాష్ర్టాలు భూగర్భ జలాలను విపరీతంగా వాడేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ర్టాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని కూడా వెల్లడించింది. భూగర్భ జలాలను వ్యవసాయానికి గణనీయంగా వాడుతున్నారని, ఇది రాబోయే ప్రమాదానికి సంకేతమని హెచ్చరించింది. ఇటీవలికాలంలో రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో బోర్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి సంప్రదాయబద్ధమైన.. చెరువులు, కుంటలు, ఫామ్పాండ్స్, కాలువలు వంటి వాటిని పునరుద్ధరించి, కట్టడాలను పెంచి నీటి వసతిని కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆ నివేదిక తెలిపింది.
ముందుచూపుతో తెలంగాణ
సాగునీటి లభ్యతను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మిషన్ కాకతీయ లాంటి బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సుమారు 46 వేలకుపైగా చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. దీంతో వాటి నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నీటితో నింపుతున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మండుటెండల్లోనూ.. సగటున భూగర్భ జలమట్టం 8.73 మీటర్ల దిగువనే లభ్యం కావడం గమనార్హం. క్రితం ఏడాదితో పోల్చుకొంటే.. ఈసారి 0.29 సెంటీమీటర్ల మేర భూగర్భజలాలు పైకి రావడం గమనార్హం.
రాష్ట్రంలో 26.60 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా.. దిగువన ఉన్న నీటిని ఎత్తి వ్యవసాయానికి వాడుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో మొదటినుంచీ తెలంగాణలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం ఎక్కువగా సాగుతున్నది. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 19.03 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా.. గడిచిన 8 ఏండ్లలో అవి 26.60 లక్షలకు పెరిగాయి. అంటే ఎనిమిది ఏండ్లలో సుమారు 7.57 లక్షల విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. 2018 జనవరి ఒకటిన వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించడం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. నాలుగున్నరేండ్లుగా దానికి ఎక్కడా అంతరాయం కలుగకుండా చూస్తున్నది.
గతం మరిచిన మోదీ
నాయకత్వ వైఫల్యం, విధాన రాహిత్యం వల్లే దేశంలో విద్యుత్తు ప్లాంట్లు మూతపడుతున్నాయి. రైతుల అవసరాలకు తగినంత కరెంటునూ కేంద్రం సరఫరా చేయడం లేదు. బొగ్గు సరఫరా లేక 30వేల మెగావాట్ల సామర్థ్యమున్న పవర్ప్లాంట్లు మూతపడ్డాయి. ఒక్క గుజరాత్లోనే 2వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దేశంలో బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నా, విద్యుత్తు ప్లాంట్లు అందుబాటులో ఉన్నా.. కరెంటు ఉత్పత్తి తగినంతగా లేకపోవడం విషాదం. ఈ కరెంటు సంక్షోభానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే కారణం. విద్యుదుత్పత్తిపై దృష్టిపెట్టకుండా.. పెద్ద పెద్ద విమానాశ్రయాలు నిర్మించడంలో ప్రధానమంత్రి బిజీగా ఉన్నారు. బడా పారిశ్రామికవేత్తల సేవల్లో ఆయన తరిస్తున్నారు.
విద్యుత్తుపై 2013లో గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ..
దేశంలో కొన్నిచోట్ల విద్యుత్తు సంక్షోభానికి రాష్ర్టాలే కారణం. దేశంలో బొగ్గు కొరత ఏ మాత్రం లేదు. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) సంస్థకు బకాయిలను చెల్లించనందువల్లే ఆయా రాష్ర్టాలకు బొగ్గు సరఫరా సకాలంలో జరుగడం లేదు. రాష్ర్టాలు ముందుచూపుతో వ్యవహరించకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎక్స్చేంజ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండా ఆయా రాష్ర్టాల డిస్కమ్లు కరెంటు కోతలకు దిగుతున్నాయి.
-ఇటీవల ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరుడు ఆర్కే సింగ్
వెలుగుల తెలంగాణ
400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 23
24 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 3,196 కోట్లతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు.
34,970 కోట్లు విద్యుత్తు సరఫరా, పంపిణీ కోసం రాష్ట్రం చేసిన ఖర్చు.