హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ)/నాగర్కర్నూల్, నవంబర్ 29: ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ సీఐ జహంగీర్ సస్పెండ్ అయ్యారు. ఎన్నికల్లో కుట్రపూరితంగా వ్యవహరించారని, వీరిని విధుల్లోంచి తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య బుధవారం రాష్ట్ర నోడల్ పోలీస్ అబ్జర్వర్కు లేఖ రాశారు. వివరాల్లోకెళితే.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని సంతోష్ ఎలైట్ అపార్టుమెంట్ను స్థానిక ఎస్సై సంతోష్ సందర్శించిన సమయంలో ఫోక్స్వాగన్ కారు (ఏపీ 28 సీహెచ్ 6759) కనిపించింది. అక్కడ కొందరు వ్యక్తుల నుంచి రూ.500 నోట్ల కట్టలు, రెండు సెల్ఫోన్లు, ఒక చెక్బుక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఎస్సై ఫ్లయింగ్ స్కాడ్ బృందాన్ని అక్కడికి పిలిపించారు. ఆ అపార్టుమెంట్లోనే స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహా నివసిస్తున్నారు. స్థానిక ఎస్హెచ్వో 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. దీనికి 171(బీ), 171(ఈ), 188 ఐసీసీని వర్తింపజేయాలి. కానీ అలా జరగలేదని, నిందితులను రక్షించేందుకు ప్రయత్నం జరిగిందని సీపీ పేర్కొన్నారు. ఈ విషయంపై ముషీరాబాద్ పీఎస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడగా 15 నిమిషాల వ్యవధిలోనే ముఠా గోపాల్ స్నేహితుడు సంతోష్, అతని సోదరుడు సుధాకర్ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో ముషీరాబాద్ ఇన్స్పెక్టర్, చిక్కడపల్లి ఏసీపీ , సెంట్రల్ జోన్ డీసీపీ ఉద్దేశపూర్వకంగానే అసలు నిందితులను వదిలేశారని, కుట్రపూరితంగా వ్యవహారించారని సీపీ వెల్లడిస్తూ, వీరి సస్పెన్షన్కు లేఖ రాశారు. సీఎస్ ఆదేశాలు, నోడల్ అధికారి సూచనలతో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సెంట్రల్ జోన్ డీసీడీగా ఏ శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీగా మదన్మోహన్, ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా వెంకట్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ప్రచారంలో పాల్గొన్న టీచర్ల సస్పెన్షన్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లు బుధవారం సస్పెండ్ అయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లను విధుల నుంచి తొలగించారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సూల్ అసిస్టెంట్ కే రామ్జీ, ఉప్పునుంతల మండలం పులియానాయక్ తండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కే రాజుపై చర్యలు తీసుకుంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.