హైదరాబాద్: రేవంత్రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేవంత్రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 44లో నివాసముంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్డులోనే రేవంత్రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తిచేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
కాబోయే సీఎం నివాసానికి తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు ప్రస్తుతం సివిల్ పోలీసులను ఉపయోగిస్తామని, తర్వాత దశలో సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచామన్నారు. ఇవాళ్టి నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారని చెప్పారు. రేవంత్రెడ్డి నివాసానికి సమీపంలో పెద్దమ్మ గుడి, ఓ సినీ నటుడి నివాసం ఉన్నాయి. ఆలయం వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లకు ఆదేశించనున్నారు.