హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి యజమానులకు అప్పగించేందుకు గత నెలలో అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) సత్ఫలితాలను ఇస్తున్నది. దీని ద్వారా తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు 23,251 ఫోన్లను బ్లాక్ చేశారు. వాటిలో 1,471 ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్గా ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన సీఈఐఆర్ పోర్టల్ సేవలు.. మే 17 నుంచి అధికారికంగా దేశమంతటా అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే.
ఈ వెబ్సైట్ను తెలంగాణ సిటిజన్ పోర్టల్కు అనుసంధానం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నా లేక చోరీకి గురైనా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదంటే ceir.gov.in వెబ్సైట్కు లాగిన్ అయ్యి వివరాలు పొందుపర్చాలి. ఫిర్యాదు చేసిన తర్వాత స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్లో ఫిర్యాదు చేయగానే ఐ ఎంఈఐ నంబర్ను ఉపయోగించి ఆ ఫోన్ను ట్రాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఎక్కడున్నా రికవరీ చేసి యజమానికి అప్పగిస్తారు.