హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అరికట్టేందుకు, సైబర్ నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ‘సైకాప్స్’ ఐటీ టూల్ను రూపొందించినందుకు జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్కు మొదటి బహుమతి లభించింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీస్ సైకాప్స్ టూల్ ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన స్టేట్ సైబర్ నోడల్ అధికారుల రెండో జాతీయ సదస్సులో భాగంగా సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్- 2022లో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి స్వాగత్ దాస్ చేతుల మీదుగా రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ ఎస్పీ దేవేందర్సింగ్ అందుకున్నారు.
సైబర్ నేరాల నియంత్రణ, దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల పరిశోధన కోసం తెలంగాణ పోలీసులు రూపొందించిన సైకాప్స్ టూల్ను ఇప్పటికే 24 రాష్ర్టాలు వాడుతున్నాయి. ఈ యాప్లో రియల్ టైంలోనే సైబర్ నేరగాళ్ల కదలికలపై దృష్టి పెట్టడంతోపాటు ఏ ప్రాంతంలో ఎలాంటి సైబర్ నేరాలు నమోదవుతున్నాయో తెలుసుకొనే వీలుంది. సైబర్ నేరాలు, నేరగాళ్లకు సంబంధించి సమాచార వినిమయంలో ఆయా రాష్ర్టాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం పెరిగింది. ఈ టెక్నాలజీతో 43 వేల ఇంటర్స్టేట్ సైబర్ లింకులను కనిపెట్టడంతోపాటు మొత్తం 238 కేసులలో 650 మంది నేరగాళ్లను అరెస్టుచేశారు. ఈ సందర్భంగా సీఐ సెల్ ఎస్పీ దేవేందర్సింగ్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, సీఐ సెల్ ఐజీ రాజేశ్కుమార్ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.