ఫిర్యాదు మొదలు కోర్టు విచారణ దాకా అన్నీ నమోదు
60 పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుకు ప్రణాళికలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీన్ని మరింత విస్తరిస్తూ పోలీస్ స్టేషన్లో సిబ్బంది, అధికారుల విధులన్నీ సాంకేతికతంగా ప్రతి అంశం నమోదయ్యేలా నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పోలీసులు, అధికారుల విధులు మరింత సులువు కావడంతోపాటు పారదర్శకత పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
పోలీస్ స్టేషన్కు ఒక పౌరుడు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు రిసెప్షన్ అధికారి నమోదు చేసుకోవడం మొదలు.. దాన్ని ఎస్హెచ్వోకు పంపడం.. ఎస్హెచ్వో దాన్ని చూసి సదరు ఎస్సై లేదా ఇతర అధికారికి అప్పగించడం..అక్కడి నుంచి దర్యాప్తు.. ఎఫ్ఐఆర్, చార్జిషీట్.. కోర్టులో కేసు ఫాలోఅప్.. ఇలా ప్రతి దశలో ఆయా విభాగాల అధికారులంతా తమతమ పనిని ఎప్పటికప్పుడు ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తుంటారు. ఆ సమాచారం ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నమోదవుతుంది. ప్రస్తుతానికి వీటిని 60 పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ 60 పోలీస్ స్టేషన్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతోపాటు పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్లు ఉండేలా ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.