హైదరాబాద్ : ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలీసు శాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. ఆ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. 18,334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గతేడాది వరకు పోలీసు శాఖలో 31,972 ఉద్యోగ నియామకాలు చేపట్టారు. తాజాగా 18,334 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనుందని కేసీఆర్ ప్రకటించారు. 2013-14 లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019-20 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది. ప్రస్తుతం ప్రకటించిన నియామకాలు భర్తీ అయితే ఈ సంఖ్య లక్షకు పైగా చేరుకోనుంది.
పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉండటంతో.. ఆ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వారు ఆ ఉద్యోగానికి కావాల్సిన ప్రిపరేషన్ను మొదలు పెట్టారు. స్పోర్ట్స్ గ్రౌండ్స్లో కఠోర సాధన చేస్తున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్పై దృష్టి సారించారు. పుస్తకాలకే పరిమితమయ్యారు.