మహబూబాబాద్, నవంబర్ 18: ఆడిట్ క్లియర్ చేసేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ ఇన్చార్జి డీఎస్పీ కే సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. సలీం మహబూబాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు అప్పీలు చేసుకున్నాడు. దీంతో ఆడిట్ క్లియరెన్స్ చేసి ఫైల్ అందించడానికి ఆడిట్ కార్యాలయానికి వెళ్లాడు.
ఫైల్ సరిగ్గా లేదని, అందుకు రూ.25 వేలు లంచం ఇవ్వాలని అసిస్టెంట్ ఆడిటర్ జిన్నారెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నాడని సీనియర్ ఆడిటర్ జాటోత్ కిశోర్కుమార్ తెలుపగా అందుకు ఆయన అంగీకరించారు. శుక్రవారం సలీం శ్రీనివాస్కు డబ్బులు ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. సదరు మొత్తాన్ని తనకు ఇవ్వాలని సార్ చెప్పారని కిశోర్కుమార్ తెలుపగా.. సలీం రూ.18 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో ప్రత్యక్షంగా కిశోర్కుమార్, పరోక్షంగా శ్రీనివాస్ పాత్ర ఉన్నట్టు గుర్తించిన డీఎస్పీ సుదర్శన్ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.