MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటించి, ఓపికతో ఉండి.. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుందని అన్నారు. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని సూచించారు.
హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి రూ.4వేలకు పెంచి.. ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్ అకౌంట్ మళ్లీ అడుగుతారా? లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానా ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు 500 గ్యాస్ సిలిండర్ వర్తిస్తుందా? లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతిపై ఫామ్లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు.