నేడు మండల కేంద్రాల్లో దీక్షలు.. రేపటినుంచి వరుస పోరాటాలు
11న హస్తినలో భారీ నిరసన దీక్ష.. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
వడ్ల కొనుగోలుకు కేంద్రంపై రైతన్నలు నాగళ్లు ఎత్తడానికి సిద్ధపడ్డారు. తాము పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమయ్యారు. టీఆర్ఎస్ నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్లపై సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఉద్యమం ప్రారంభం కానున్నది. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడ్తారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటుగా మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రైతుల ఆకాంక్షలను కేంద్రానికి తెలిపి, రాజకీయాలను పక్కకు పెట్టి వడ్లను కొనుగోలుచేసే విధంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణపై సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నాయకులకు దిశానిర్దేశంచేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర అన్ని స్థాయిల నాయకులు ఆయా మండలాల పరిధిలో నిరసన దీక్షల్లో పాల్గొంటారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. వడ్ల పోరుకు సై అన్నది. సోమవారం మండల కేంద్రాల్లో దీక్షలతో మొదలయ్యే పోరాటం 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించే దీక్షతో రణ నినాదం చేయనున్నది. యాసంగిలో వరి వేయాలని, సీఎం కేసీఆర్తో సంబంధం లేకుండా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజలు, రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వాళ్ల అసలు రూపం బట్టబయలుచేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడానికి ప్రయత్నిస్తే బీజేపీ నేతలు వరివేసేలా రెచ్చగొట్టి ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసిన వైనాన్ని రైతులకు టీఆర్ఎస్ నేతలు వివరించనున్నారు.
తెలంగాణను, ఇక్కడి ప్రజలను, రైతులను పదే పదే అవమానించేలా, అవహేళన చేసేలా మాట్లాడుతున్న నాయకులు, కేంద్రం వైఖరిని రైతులకు వివరిస్తారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి, రాష్ట్ర మంత్రులకు పనిలేకుండా ఢిల్లీకి వస్తున్నారా అంటూ కేంద్ర మంత్రి గోయల్ చేసిన వ్యాఖ్యలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆహార భద్రత చట్టానికి మార్పులు తీసుకువస్తే లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెం ట్ విధానాన్ని తీసుకురావాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉభయ సభలు ముగిసే వరకు నిరసనలను కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి స్పందన వచ్చే వరకు ఇదే విధమైన కార్యాచరణతో ముందుకువెళ్లనున్నారు.
మరింత ఒత్తిడికి…
కేంద్రం వడ్లను కొనాలని ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ మొదటి దశ ఉద్యమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, ఎంపీపీ, జడ్పీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తీర్మానాలుచేసి ప్రధాని, కేంద్ర మంత్రి గోయల్కు పంపించారు. కేంద్రమంత్రిని కలిసి వడ్లను కొనాలని రాష్ట్ర మంత్రుల బృందం కోరిం ది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండో విడత కార్యాచరణను అమలు చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన అనంతరం ఈ నెల 6న రాష్ట్రంలోని ప్రధానమైన నాలుగు జాతీయ రహదారులు నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో చేస్తారు. 7న హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. 8న రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తారు. ప్రతి రైతు, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త, నాయకుల ఇండ్లపై నల్లా జెండాను ఎగురవేస్తారు. ఈనెల 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.
ఢిల్లీకి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి ఉన్నారు.
ధరల పెరుగుదలపై రేపటి నుంచి సీపీఐ నిరసనలు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం గత 11 రోజుల నుంచి పథకం ప్రకారం ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నదని ధ్వజమెత్తారు. చమురు కంపెనీలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకొనే వెసులుబాటు కల్పించారని మండిపడ్డారు. సకల జనులపై తీవ్ర ప్రభావాన్ని చూపే ధరల పెరుగుదలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు రేపటి నుంచి వారం రోజులపాటు అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో వినూత్న పద్ధతుల్లో నిరసన తెలియజేయాలని సీపీఐ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.