హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ర్టంలో సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలకు చేరుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. పంట ఉత్పత్తులకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహం ఉండాలని అధికారులను ఆదేశించింది. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మారెటింగ్, నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం బుధవారం ప్రగతిభవన్లో రెండోరోజూ కొనసాగింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖపై క్యాబినెట్ చర్చించింది. గతేడాది వ్యవసాయరంగంలో సాధించిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగువిస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శులు క్యాబినెట్ ముందుంచారు.
పౌరసరఫరాలశాఖ సహా వ్యవసాయశాఖలో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని క్యాబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ప్రాసెసింగ్లో భాగంగా మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్నచోటుకు సరఫరా చేయాలని అధికారులకు స్పష్టంచేసింది. అవసరమైతే సంబంధిత నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని పేర్కొన్నది. అన్నిరకాల వ్యవసాయఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆదేశించింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం తీరు ఎలా ఉండేది, నేడు స్వయంపాలనలో ఎలా వృద్ధి చెందిందనే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముందుంచారు. ఏడేండ్లలో వ్యవసాయంలో తెలంగాణ విజయాలను ప్రస్తావించారు. ఉమ్మడిపాలనలో నిత్యం కరెంటు కోతలతో రైతులు కష్టాలుపడ్డారని.. నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని సీఎం తెలిపారు. అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకొని నదీజలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు మళ్లించుకున్నామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం భారీగా పెరిగిందని తెలిపారు. రైతుబంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచటం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈ చర్యల ఫలితంగా గతేడాది రికార్డుస్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో రైతుకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వమే గ్రామాల్లోకి వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వివరించారు. ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకనుగుణంగా పంట ఉత్పత్తుల నిల్వ, మారెటింగ్పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వరి, పత్తితోపాటు, ఇతర పంటల ఉత్పత్తి భారీగా పెరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్తగా రైస్మిల్లులు, పార్బాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని సూచించారు. అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమలశాఖను ఆదేశించారు. రైతులకు సమగ్ర శిక్షణ ఇవ్వడానికి సౌకర్యాలను వ్యవసాయశాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని స్పష్టంచేశారు. ఉద్యానవనశాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని, అవసరమైన రీతిలో అధికారులను, నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అంచనాలను మించి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. పౌరసరఫరాలశాఖ, మిల్లర్లు, ఇతర రాష్ర్టాలు కొనుగోలు చేసినది కలిపితే ఈ ఒక్కఏడాదే 3 కోట్ల టన్నులకుపైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఉండగా, కోటి టన్నులకు పెంచాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 2,441 మిల్లులు ఉండగా, రా రైస్మిల్లులు 1,520 పార్బాయిల్డ్ మిల్లులు 921 ఉన్నాయి. ఇవి రోజుకు 1.11 లక్షల టన్నుల మిల్లింగ్ సామర్థ్యమే కలిగి ఉన్నాయి. కొత్త మిల్లుల్లో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా జపాన్కు చెందిన ‘సటాకే’ సంస్థ తక్కువ ధరకే అందించేందుకు అంగీకరించింది. ఈ యంత్రాల ద్వారా ప్రతి గంటకు 21 టన్నుల సామర్థ్యంతో ప్రతిరోజు 500 టన్నులకుపైగా ధాన్యం మిల్లింగ్ చేసే అవకాశం ఉన్నది.