రంగారెడ్డి/హైదరాబాద్ సీటిబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్కడ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న గోరెటి శ్రీశైలం.. రైతులు బతికుండగానే చనిపోయినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రైతు బీమా, రైతుబంధు పథకాల కింద ఏకంగా రూ.2 కోట్ల సొమ్ము స్వాహా చేశాడు. ఎల్ఐసీ అధికారులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆయన అక్రమాల డొంక కదలింది. రూ.కోటి నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది. ఆ తర్వాత వ్యవసాయ అధికారులు అంతర్గతంగా జరిపిన విచారణలో మొత్తం రూ.2 కోట్ల భారీ కుంభకోణం బయటపడింది. దీంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శ్రీశైలంతోపాటు వీరస్వామి అనే ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఏఈవో శ్రీశైలం దాదాపు మూడేండ్ల నుంచి ఈ అక్రమాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న చాలా మంది రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల వివరాలను అధికారులకు సమర్పించపోవడంతో ఆ డబ్బులు పెండింగ్లో ఉంటున్నాయి. దీన్ని ఆసరగా చేసుకుని అక్రమాలకు తెరలేపిన శ్రీశైలం.. వివరాలు సమర్పించని రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల డేటాను సేకరించాడు. వాటికి తన స్నేహితులు, బంధువులకు సంబంధించిన అకౌంట్లను జత చేసి దాదాపు 2 వేల మంది అన్నదాతలకు చెందాల్సిన రూ.కోటి రైతు బంధు నిధులను పక్కదారి పట్టించాడు.
నకిలీ సర్టిఫికెట్లతో శ్రీశైలం బతికి ఉన్న రైతులను చనిపోయినట్టుగా చూపి రైతు బీమాకు సంబంధించిన మరో కోటి రూపాయలను స్వాహా చేశాడు. 130 వరకు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించడంతోపాటు డెత్ సర్టిఫికెట్లలోని వివరాలను మార్ఫింగ్ చేసి 20 మంది రైతులకు సంబంధించిన బీమా సొమ్మును బినామీ ఖాతాల్లోకి మళ్లించాడు. అయితే రెండు, మూడు క్లెయిమ్లు ఒకే ఖాతాలో జమ కావడంతో అనుమానం వచ్చిన ఎల్ఐసీ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బట్టబయలైంది. శ్రీశైలం అక్రమాపై అంతర్గత విచారణ జరపడంతో రూ.2 కోట్ల రైతు బంధు నిధులు పక్కదారి పట్టినట్టు తేలింది. దీంతో శ్రీశైలంను సస్పెండ్ చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సూచించింది.