హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక శాతం మందికి టీకాలు వేసిన రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్ వేశారు. మొదటి డోస్ విషయంలో పెద్ద రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణ అత్యధిక శాతం టీకాలు వేసిన రాష్ట్రంగా నిలువగా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రెండు, మూడు స్థానంలో నిలిచాయి. బీహార్, పంజాబ్, జార్ఖండ్ చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు డిసెంబర్ ఆఖరులోగా అర్హులందరికీ టీకాలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో వైద్యారోగ్యశాఖ వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో సిబ్బంది పకా ప్రణాళికతో పనిచేస్తున్నారు. టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని, గడువు ముగిసినా రెండో డోస్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేస్తున్నారు. ఇంటింటికీ తిరగటంతోపాటు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ప్రజలను ఒప్పించి టీకాలు వేస్తున్నారు.
రాష్ట్రంలో 2,77,67,000 మందిని కొవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించారు. ఈ నెల మొదటివారం నాటికి దాదాపు 2.5 కోట్ల మంది మొదటి డోస్ తీసుకోగా, 1.3 కోట్ల మంది రెండోడోస్ వేసుకొన్నారు. 24 లక్షల మంది గడువు పూర్తయినా రెండో డోస్ వేసుకోలేదని తేలింది. సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం సాధించాలంటే నెల రోజుల్లో 80 లక్షలకుపైగా డోసులు వేయాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి రోజుకు సగటున 3 లక్షల టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు 70 లక్షలకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా 2.76 కోట్ల మందికి మొదటి డోస్ వేసి 99 శాతానికిపైగా లక్ష్యం సాధించారు. గత 10 రోజులుగా రెండో డోస్పై దృష్టి సారించారు. మొదటి డోస్కు మించి దాదాపు మూడు రెట్లు వేస్తున్నారు. ఫలితంగా ఈ నెల ప్రారంభంలో 48 శాతంగా ఉన్న రెండో డోస్ పంపిణీ, ఇప్పుడు ఏకంగా 63 శాతానికి పెరిగింది. ఇండ్లు, పొలాలు, పని ప్రదేశాలు.. ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటా టీకాలు వేస్తున్నారు.
శుక్రవారం నాటికి దాదాపు 20 జిల్లాల్లో వంద శాతం మొదటి డోస్ పంపిణీ పూర్తయింది.
మరో మూడు జిల్లాల్లో 99 శాతం టీకాల పంపిణీ జరిగింది.
దాదాపు 15 జిల్లాల్లో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్ పూర్తయింది.