తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర క్షణాలివి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిలబెట్టుకుంటున్న మధుర ఘట్టమిది. ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణకు మాత్రమే సాధ్యమన్న రీతిలో అద్భుత కట్టడం.. ప్రపంచం ముందు తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ పట్టుదల, అకుంఠిత దీక్షకు మరో తార్కాణం.
కొత్త సచివాలయం నిర్మించుకోవాలన్న ఆకాంక్ష మొగ్గ తొడిగిన మరుక్షణం నుంచే దానిని అడ్డుకోవాలనే కుతంత్రాలు.. ఎన్నో వెటకారాలు.. మరెన్నో అవాంతరాలు.. కోర్టు కేసులు ముఖ్యమంత్రిపై నీలాపనిందలు.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. 2019 జూన్ 27న కేసీఆర్ భూమిపూజ చేయడంతో తొలి అడుగు పడింది. ఇంతలో కరోనా రూపంలో మరో అవాంతరం.. అన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ 2021 జనవరిలో పనులకు శ్రీకారం. ఇది మా సచివాలయం అంటూ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించేలా ఆధునిక హంగులతో, అద్భుతమైన నిర్మాణ రీతులతో, అపూర్వ పాలనా సౌధం రూపుదిద్దుకున్నది. ఇది తెలంగాణ లిఖించిన మరో చరిత్ర. కేసీఆర్ నిబద్ధతకు నిలువెత్తు రూపం.
Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం’ ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ప్రారంభించనున్నారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సీఎం ప్రారంభిస్తారు. సచివాలయ ప్రధాన ద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అదే సమయానికి మంత్రులంతా ఎవరికివారు తమతమ కార్యాలయాలను ప్రారంభించుకొని కొలువుదీరుతారు. అధికారులు కూడా తమతమ శాఖల కార్యాలయాల్లో ఆసీనులవుతారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం రాష్ట్ర పరిపాలనా అవసరాలకు సరిపోకపోవటంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 2020 నవంబర్లో ‘షాపూర్ జీ- పల్లోంజీ’ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ భవన నిర్మాణ పనులకు సంబంధించిన ఒప్పందం చేసుకొన్నది. 2021 జనవరి 4వ తేదీన సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించారు. రికార్డు సమయంలో 26 నెలల వ్యవధిలోనే 10 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన సచివాలయ భవనాన్ని నిర్మించారు. దేశంలో ఇంత వేగంగా నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనం మరేదీ లేదు. కరోనా లాంటి విపత్తుకాలంలో కూడా పనులు ఆగకుండా కొనసాగాయి.
హోమం… యాగం
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహించనున్నారు. ప్రార్థనలు కూడా జరుపనున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుంచి రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉదయం 6.15 నిమిషాలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్రెడ్డి దంపతులు పాల్గొంటారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సచివాలయానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రికి వేదపండితులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. 1:20 నుంచి 1:32 గంటలకు మధ్య పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆరో అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులై ఫైలుపై సంతకం చేస్తారు. మంత్రులందరూ తమతమ కార్యాలయాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 56 నిమిషాల నుంచి రెండు గంటల నాలుగు నిమిషాల మధ్య ఆసీనులవుతారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల నుంచి రెండు గంటల 45 నిమిషాల మధ్య సచివాలయం ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం నుంచే కొత్త సచివాలయం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
కండ్లు జిగేల్మనే ఇంటీరియర్
సచివాలయంలో అద్భుతమైన, సౌకర్యవంతమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్ వస్తువులు అందుబాటులో ఉంచారు. వీటిలో టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, స్టాండ్లు, కప్బోర్డులు, టీపాయ్లు తదితరాలున్నాయి. వివిధ సెక్షన్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, మంత్రులు, సీఎం చాంబర్లు, వారి సిబ్బంది కార్యాలయాలు, సీఎస్ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారుల పేషీలకు కలిపి 1,880 టేబుళ్లు, 4,886 కుర్చీలు వేశారు. మంత్రులకు 23 చాంబర్లు ఏర్పాటు చేశారు. 26 కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మరో 4 కాన్ఫరెన్స్ హాళ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలోని ప్రతీ ఫ్లోర్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు.
మంత్రులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సీఎస్కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు. 1,190 మంది సెక్షన్ ఆఫీసర్లకు, 106 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 59 మంది డిప్యూటీ సెక్రటరీలకు, 29 మంది అదనపు/జాయింట్ సెక్రటరీలకు, 58 మంది సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించి దాని ఆధారంగా ఎన్ని సీట్లు, ఎంత మంది విజిటర్ సీట్లు, సోఫాలు ఎన్ని, టీవీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఎన్ని అనేది పక్కాగా లెక్కలు వేసి ఏర్పాటు చేశారు. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో పనిచేసేలా కార్యాలయాలను సిద్ధం చేశారు. అధికారులకు అన్ని వసతులను సమకూర్చారు. స్కైలాంజ్ పేరుతో ప్రత్యేక లాంజ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ లాంజ్లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, విదేశీ ప్రతినిధుల కోసం ప్రత్యేక సమావేశమందిరాన్ని సిద్ధంచేశారు.
సచివాలయ ప్రారంభ కార్యక్రమ షెడ్యూల్